పాకిస్తాన్లోనూ తబ్లిగి జమాత్ కల్లోలం:ఢిల్లీ తరహాలో..: 80 వేల మందితో సామూహిక మత ప్రార్థనలు
ఇస్లామాబాద్: మనదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడానికి ప్రధాన కారణమైనట్టుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఢిల్లీ మత ప్రార్థనల ప్రభావం పాకిస్తాన్పైనా పడింది. ఆ దేశంలోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనలే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సామూహిక మత ప్రార్థనల్లో పాల్గొన్న వారి కారణంగా తమ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అవుతోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
70 నుంచి 80 వేల మందితో
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో కిందటి నెల 10వ తేదీన తబ్లిగి జమాత్ ప్రతినిధులు సామూహిక మత ప్రార్థనలను నిర్వహించినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. దీనిపై ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. పంజాబ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులను ఉటంకించాయి ఈ కథనాల్లో. 70 నుంచి 80 వేల మందితో సామూహిక మత ప్రార్థనలను నిర్వహించారని, అనంతరం వారంతా ఎలాంటి వైద్య పరీక్షలను కూడా నిర్వహించుకోకుండా తమ స్వస్థలాలకు చేరుకున్నట్లు పేర్కొన్నాయి.
రెండున్నర లక్షల మందితో ప్లానింగ్..
కరోనా వైరస్ విస్తరించడాన్ని అరికట్టడానికి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం లాక్డౌన్ను ప్రకటించినప్పటికీ.. తబ్లిగి జమాత్ నిర్వాహకులు దాన్ని పట్టించుకోలేదు. సుమారు రెండున్నర లక్షలమందితో పంజాబ్ ప్రావిన్స్లో తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనలను నిర్వహించడానికి ప్లాన్ చేయగా..ప్రభుత్వం చేపట్టిన నిర్బంధ చర్యల వల్ల 70 వేల నుంచి 80 వేల మంది వరకు హాజరయ్యారని పాకిస్తాన్ మీడియా స్పష్టం చేసింది. ఆరు రోజుల పాటు ఈ మత ప్రార్థనలను నిర్వహించడానికి మొదట ప్రణాళికను రూపొందించుకోగా.. లాక్డౌన్ వల్ల మూడు రోజులకు కుదించుకుందట.
మూడువేల మందికి పైగా విదేశీయులు..
ఈ మత ప్రార్థనలకు మూడువేల మందికి పైగా విదేశీయులు కూడా పాల్గొన్నారు. ఇండోనేషియా, మలేసియా వంటి పొరుగు దేశాల నుంచి వారంతా పంజాబ్ ప్రావిన్స్కు చేరుకున్నారు. మత ప్రార్థనలు కొనసాగుతోన్న సమయంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడం, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయడం వంటి చర్యల వల్ల వారంతా ప్రస్తుతం పాకిస్తాన్లోనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారనే విషయం తెలియరావట్లేదని, వారి గురించి పోలీసులు గాలిస్తున్నారని పేర్కొంది.
రైవిండ్ సిటీలో జమాతీల్లో భారీగా పాజిటివ్ కేసులు..
రైవిండ్ సిటీలోనే వందలాది మంది స్థానికులు తబ్లిగి జమాత్ మత ప్రార్థనల్లో పాల్గొన్నట్లు లాహోర్ పోలీసులు గుర్తించారు. ఈ ఒక్క నగరంలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రెండు లక్షల వరకు జనాభా గల రైవిండ్ సిటీ ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ.. వారంతా పంజాబ్ ప్రావిన్స్లో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనలకు ఎలా వెళ్లగలిగారనే విషయంపై పాకిస్తాన్ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది.
Recommended Video
విదేశీయులు సహా జమాతీలను గుర్తించడానికి టాస్క్ఫోర్స్..
తబ్లిగి జమాత్ ప్రార్థనల్లో పాల్గొనడానికి వచ్చిన 3000 మంది విదేశీయులతో పాటు మిగిలిన వారిని గుర్తించడానికి ప్రత్యేకంగా ఓ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు లాహోర్ క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ (సీపీపీఓ) జుల్ఫికర్ హమీద్ వెల్లడించారు. సద్దర్ డివిజన్ ఎస్పీ (ఆపరేషన్) సయ్యద్ ఘజన్ఫర్కు ఈ బాధ్యతలను అప్పగించారు. ఈ టాస్క్ఫోర్స్ ఇప్పటికే తన కార్యకలాపాలను ఆరంభించిందని, సామూహిక మత ప్రార్థనలను నిర్వహించిన ప్రదేశాన్ని సందర్శించినట్లు హమీద్ వెల్లడించారు.