Covid-19:కేసులు తగ్గాయనుకుంటే పొరపాటే... భారత్తో సహా పలుదేశాలకు WHO వార్నింగ్
ఐక్యరాజ్య సమితి: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు ప్రపంచ దేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. అయితే లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతుండటంతో పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని భావించి లాక్డౌన్ ఆంక్షల్లో సడలింపులు ఇచ్చాయి. ఇప్పుడు ఇదే మళ్లీ కొంప ముంచనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేసులు తగ్గాయి కదా పలు అంశాల్లో సడలింపులు ఇస్తున్న క్రమంలో తిరిగి మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆకాశాన్నంటే సూచనలు కనిపిస్తున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది.
Recommended Video
కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కొన్ని దేశాల్లో తగ్గుముఖం పడుతుండగా మరికొన్ని దేశాల్లో విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఎమర్జెన్సీ హెడ్ డాక్టర్ మైక్ ర్యాన్ చెప్పారు. కేసులు పెరుగుతున్న దేశాల్లో సెంట్రల్ మరియు దక్షిణ అమెరికా, దక్షిణాసియా, మరియు ఆఫ్రికా దేశాల్లో కేసులు పెరిగిపోతున్నాయని హెచ్చరిస్తున్నారు. అయితే ఇలాంటి విపత్తులు ఒక్కసారి వచ్చి వినాశనం చేసి వెళ్లిపోతాయని ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ విజృంభిస్తుందని ఆయన అన్నారు. కరోనావైరస్ తొలిసారిగా వచ్చి ఆయా దేశాల్లో విజృంభించి ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది అని అనుకోవడానికి లేదని అన్నారు. తొలిసారి వచ్చిన సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తే తిరిగి మళ్లీ కాటేసేందుకు ఈ మహమ్మారి కాచుకుని కూర్చుంటుందని చెప్పారు.
కరోనావైరస్ మహమ్మారి తగ్గిపోయిందని అనుకునేందుకు లేదని చెప్పిన ర్యాన్.. ఏ సమయంలోనైనా అది తిరిగి పుంజుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏదో కేసులు తగ్గుతున్నాయిలే అనుకుని అజాగ్రత్తగా ఉంటే ప్రమాదంలో పడినట్లే అని చెప్పారు. ఇలా అజాగ్రత్తగా ఉంటే రెండో దఫాలో ఈ మహమ్మారి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. యూరోప్ మరియు ఉత్తర అమెరికా దేశాల్లో జాగ్రత్త చర్యలు నిలపరాదని వాటిని కొనసాగించాలని ఆయన సూచించారు. కరోనావైరస్ పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టెస్టింగులను నిలిపివేయరాదని కోరారు. గ్రాఫ్ ఫ్లాట్ అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల పట్ట అలసత్వం ప్రదర్శించకూడదని ర్యాన్ చెప్పారు.
చాలా వరకు యూరోప్ మరియు అమెరికాలో చాలా రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటంతో లాక్డౌన్ ఎత్తివేయడం జరిగింది. ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు లాక్డౌన్ను ఎత్తివేశాయి. దీంతో కేసుల్లో క్రమంగా పెరుగుదల కనిపిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్యసంస్థ. గ్రాఫ్ పడిపోతున్న క్రమంలో జాగ్రత్త చర్యలు విస్మరిస్తే విపత్తు చూడక తప్పదని హెచ్చరించింది.