అమెరికాలో మళ్లీ భయానకం: భారీగా కొవిడ్ మరణాలు.. ఇంకా పెరగొచ్చన్న ట్రంప్.. ఇండియా నంబర్2..
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గనప్పటికీ.. గడిచిన రెండు వారాలుగా మరణాలు మళ్లీ భారీగా పెరగడం కలకలం రేపుతున్నది. ఏప్రిల్-మే మధ్యలో చోటుచేసుకున్న తరహాలో ఇప్పుడు మళ్లీ రోజుకు కనీసం వెయ్యిమంది తక్కువ కాకుండా ప్రాణాలు కోల్పోతుండటం గమనార్హం. దేశంలో కరోనా ఉధృతి మరింత పెరగొచ్చంటూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం అక్కడి పరిస్థితిని తెలియజేస్తున్నది.
ఏపీ రాజధాని మార్పు: రంగంలోకి మోదీ! - గవర్నర్కు పీఎంవో కాల్?.. ఇటు హైకోర్టూ కీలక ఆదేశాలు..
రిఫ్రిజిరేటర్లలో మృతదేహాలు..
గురువారం నాటికి అమెరికాలో ఇన్ఫెక్షన్ కు గురైనవాళ్ల సంఖ్య 41లక్షలకు పెరిగింది. అదులో 1.46 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 19లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నా, ఇప్పటికీ యాక్టివ్ కేసుల సంఖ్య 20లక్షలకు పైనే ఉంది. కొద్ది రోజులుగా మరణాలు తగ్గిపోవడం కాస్త ఉపశంపనం కలిగించినా, వారం రోజులుగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ.. బుధ, గురువారాల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 1100పైచిలుకు మరణాలు నమోదయ్యాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మృతదేహాలను రిఫ్రిజిరేటర్లలో భద్రపరుస్తోన్న సంఘటనలు చోటుచేసుకున్నాయి.
స్మశానాలు బిజీ.. వెయిటింగ్ లిస్ట్..
అమెరికాలో మే చివరి వారం తర్వాత మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. జూన్ నుంచి జులై రెండో వారం దాకా ఏరోజూ మృతుల సంఖ్య భారీగా నమోదుకాలేదు. అయితే గడిచిన రెండు వారాలుగా అలబామా, నెవడా, టెక్సాస్ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. మిన్నెసొటా, ఓహాయో, ఇండియానా రాష్ట్రాల్లో సైతం మృతుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగూతోంది. ప్రధానంగా, మెక్సికోతో సరిహద్దును పంచుకునే టెక్సాస్ రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా తయారైంది. వారం వ్యవధిలోనే మరణాలు రెట్టింపు కావడంతో అక్కడి స్మశానాల్లో రద్దీ ఏర్పడింది. హిడాల్గో కౌంటీలోని స్మశానవాటికల్లో అంత్యక్రియల నిర్వహణకు రెండు వారాల పాటు వెయిటింగ్ లిస్ట్ ఉండటంతో.. మృతదేహాలను రిఫ్రిజిరేటర్ ట్రక్కుల్లో భద్రపరుస్తున్నారు.
ట్రంప్ వ్యాఖ్యలతో బెంబేలు..
కరోనా విషయంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనుసరిస్తోన్న విధానాలు, చేస్తున్న వ్యాఖ్యలు తొలి నుంచీ వివాదాస్పదంగానే ఉన్నాయి. మొదట్లో కరోనాను తేలికగా కొట్టిపారేసిన ఆయన.. అమెరికాలో కేసులు, మరణాలు భారీగా చోటుచేసుకోవడంతో చైనాపై నిందారోపణలకు దిగారు. మధ్యలో కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ మరణాలు పెరగడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇదే సమయంలో ట్రంప్.. ప్రభావం తగ్గేముందు కరోనా వైరస్ మరింత భాకరంగా విజృంభిస్తుందని, మరణాలు ఇంకా పెరగొచ్చని హెచ్చరించారు.
అమెరికా ఫస్ట్.. ఇండియా సెకెండ్..
నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడి భారతీయ ఓటర్లను ఆకట్టుకునేలా ట్రంప్.. వీలైనన్ని ఎక్కువసార్లు ఇండియ పేరును ప్రస్తావిస్తూ వస్తున్నారు. కరోనా టెస్టుల విషయంలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, ఇండియా రెండో స్థానంలో ఉందని ఆయన చెప్పారు. యూఎస్ లో 5కోట్ల మందికి కరోనా టెస్టులు నిర్వహిస్తే, భారత్ లో 1.2 కోట్ల శాంపిల్స్ పరీక్షించారని చెప్పారు. అదేసమయంలో చైనా మందులపైనా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాను అంతం చేయడానికి ఏ దేశం మొదట వ్యాక్సిన్ తీసుకొచ్చినా, వారితో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మొదట్లో మాస్కులు వద్దన్న ట్రంప్ ఇప్పుడు.. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాల్సిందేనని పిలుపునిచ్చారు.
Recommended Video
కరోనా కట్టడిలో ట్రంప్ ఫెయిల్..
అమెరికాలో కరోనా వైరస్ కట్టడి చర్యల్లోగానీ, చికిత్స ఏర్పాట్లలోగానీ ప్రెసిడెంట్ ట్రంప్ దారుణంగా ఫెయిలయ్యారని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్ తదితర సంస్థలు నిర్వహించిన సర్వేల్లో జనం ట్రంప్ తీరుపై పెదవివిరిచారు. అదే సమయంలో ట్రంప్ ప్రత్యర్థి జో బిడెన్ పనితీరుకు ఆదరణ పెరుగుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈ నెల 12 నుంచి 15 వరకు వివిధ అంశాల వారీగా చేపట్టిన సర్వేలో.. ట్రంప్ కన్నా బిడెన్ బాగా పనిచేస్తారని 54 శాతం మంది అమెరికన్లు చెప్పారు. సర్వేలో పాల్గొన్న వాళ్లలో కేవలం 34 శాతం మంది మాత్రమే ట్రంప్ పనితీరు బాగున్నట్లు చెప్పడం గమనార్హం. ఇదే అభిప్రాయం ఎన్నికల వరకూ కొనసాగితే ట్రంప్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడొచ్చని అనలిస్టులు అంటున్నారు.