కరోనా: అమెరికాలో మనోళ్లకు బిగ్ రిలీఫ్.. హెచ్1బీ వీసాల గడువు 8నెలలకు పెంపు.. ఫలించిన ‘HCQ’ దౌత్యం
మహమ్మారి కరోనా ధాటికి అతలాకుతలమైపోతున్న వేళలోనూ అగ్రరాజ్యం అమెరికా పెద్దన్న మనసు చాటుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో హెచ్1బీ వీసాదారుల పట్ల కఠినంగా వ్యవహరించొద్దన్న భారత ప్రభుత్వం విన్నపానికి అక్కడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అక్కడ టెక్ నిపుణులుగా పనిచేస్తూ, ఉద్యోగాలు కోల్పోయినవాళ్ల హెచ్1బీ వీసా గడువును ఏకంగా ఎనిమిది నెలలు పొడగించారు. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) మంగళవారం ఒక ప్రకటన చేసింది.
ఆన్ లైన్ లో అప్లికేషన్లు..
సాధారణంగా అమెరికాలో నాన్ ఇమిగ్రంట్స్ ఎవరైనాసరే వీసా గడువు ముగిసిన తర్వాత రెండు నెలల లోపల దేశం విడిచి వెళ్లాలన్న నిబంధన ఉండేది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఊహించని విధంగా లాక్ డౌన్ నెలకొనడంతో... హెచ్1బీ వీసాల గడువును 8 నెలలపాటు పొడగిస్తున్నట్లు యూఎస్సీఐఎస్ పేర్కొంది. ఈ మేరకు అప్లికేషన్ల స్వీకరణ మంగళవారం నుంచి మొదలుపెడుతున్నామని, సంబంధిత ఫామ్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచామని అధికారులు చెప్పారు.
90 కోరితే 240 ఇచ్చారు..
హెచ్1బీ వీసా గడువు ముగిసినా.. భారతీయ టెకీలను అక్రమ వలసదారుగా భావించరాదని, హెచ్1బీ వీసాతోపాటు అన్ని రకాల వీసాల గడువులను 90 రోజుల వరకు పెంచాలని భారత ప్రభుత్వంతోపాటు సాఫ్ట్ వేర్ కంపెనీల సమాఖ్య ‘నాస్ కామ్' విజ్ఞప్తి చేసింది. హెచ్1బీ వీసాలపై పనిచేస్తున్న భారతీయుల సంఖ్య దాదాపు 3లక్షలు ఉండొచ్చని అంచనా. వీళ్లలో కొద్దిమంది ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోగా, కొవిడ్-19 దెబ్బకు మరింతమందిపై ఎఫెక్ట్ పడే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే భారత్ అడిగినదానికంటే మిన్నగా.. కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా.. హెచ్1బీ సహా అన్ని రకాల వీసాల గడువులను 240 రోజులు(8నెలలు) పొడిగించడం గమనార్హం.
అన్ని హక్కులు వర్తిస్తాయి..
హెచ్1బీ వీసాపై అమెరికాలో పని చేసేవారిని సంస్థ యాజమాన్యం తొలగిస్తే .. వెంటనే మరో సంస్థలో ఉద్యోగం పొందాల్సి ఉంటుంది. లేని పక్షంలో హెచ్1బీ వీసా రద్దవుతుందని తెలిసిందే. దీనిపైనా యూఎస్సీఐఎస్ క్లారిటీ ఇచ్చింది. పొడగింపుతోపాటు అదనపు గడువు పొందేవాళ్లంతా.. అప్పటికే పనిచేస్తున్న సంస్థల్లో ఉద్యోగులుగానే కొనసాగుతారని, గతంలో ఏవైతే హక్కులు, సౌకర్యాలు పొందారో.. వచ్చే 8 నెలలపాటూ అనుభవించొచ్చని అధికారులు స్పష్టం చేశారు.
ఫలించిన దౌత్యం..
ట్రంప్ ఏలుబడిలో వలసదారులపై కఠిన నిబంధనలు అమలవుతోన్న నేపథ్యంలో అగ్రరాజ్యంలో ఉంటున్న హెచ్-1బీ వీసాదారుల్లో ఆందోళన నెలకొంది. లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేనందున వీసాల గడువును పెంచాలంటూ వేలాది మంది హెచ్-1బీ వీసాదారులు ట్రంప్ సర్కార్కు లేఖ రాశారు. ఇటు భారత ప్రభుత్వం కూడా వినతులు చేసింది. ఈలోపే కొవిడ్-19 చికిత్సలో వాడుతోన్న హైడ్రాక్వీ క్లోరోక్విన్(HCQ) డ్రగ్ ఎగుమతిపై భారత్ సానుకూలంగా స్పందించింది. ‘‘ఇంత పెద్ద మొత్తంలో మందులు పంపుతున్నప్పుడు.. మనవాళ్ల వీసాల గురించి ఎందుకు అడగరు?'' అని ప్రతిపక్షనేతలు ప్రశ్నించారు కూడా. వీసాల గడువులపై అమెరికా తాజా ప్రకటనతో భారత్ దౌత్యం ఫలించినట్లయింది.
Recommended Video
ఆగని మరణాలు..
అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 6లక్షల దిశగా వెళుతున్నది. ఇప్పటికే 23,644 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 13వేల మంది కండిషన్ సీరియస్ గా ఉంది. ఒక్క న్యూయార్క్ లోనే 10వేల మందికిపైగా చనిపోవడం విషాదకరం. అయితే, ఆదివారం నాటికి ‘ప్రమాదకర స్థితి' నుంచి బయటపడ్డామని న్యూయార్క్ గవ్నర్ ఆండ్రూ క్యూమో ప్రకటించడం కచ్చితంగా శుభవార్తే. ఊహించని ఉత్పాతాలు తలెత్తితే తప్ప రాబోయే రెండు వారాల్లో అక్కడ పరిస్థితి చక్కబడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.