షార్క్స్కి శాపంగా మారిన కరోనా వ్యాక్సిన్... ఎన్ని లక్షల జీవాలు బలవుతున్నాయో తెలుసా...
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని ఓ సామెత. ఇప్పుడు షార్క్స్(సొరచేపల) పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థం(అడ్జువంట్-ఇమ్యునాలాజికల్ ఏజెంట్) కోసం చాలావరకు వ్యాక్సిన్ కంపెనీలు షార్క్స్ పైనే ఆధారపడుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు 5లక్షల షార్క్స్ బలైపోయాయి.
షార్క్స్ కాలేయంలో ఉండే ఆ పదార్థం శరీరంలో త్వరగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. దీంతో చాలావరకు కమర్షియల్ వ్యాక్సిన్ తయారీదారులు షార్క్స్ను చంపి ఆ ఇమ్యునాలాజికల్ పదార్థాన్ని తమ ప్రయోగాల్లో వాడుతున్నారు. జనాభాకు తగ్గట్లు భారీగా వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తికి ఆయా దేశాలు చేస్తున్న ప్రయత్నాలు కూడా షార్క్స్ ఉనికికి ముప్పుగా పరిణమించాయి.
నిజానికి షార్క్స్లోనే కాదు ఇతర జంతువుల కాలేయాల్లోనూ ఇమ్యునాలాజికల్ పదార్థం ఉంటుంది. కానీ వ్యాక్సిన్ కంపెనీలు మాత్రం దాన్ని షార్క్స్ నుంచి సేకరించేందుకే ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాక్సో స్మిత్క్లైన్ అడ్జువంట్ పదార్థంతోనే 1బిలియన్ వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తిని చేపడుతున్నట్లు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఒక్క అమెరికాలోనే దాదాపు 21వేల షార్క్స్ను వ్యాక్సిన్ తయారీ కోసం బలి తీసుకున్నట్లు షార్క్స్ యాలీస్ అనే సంస్థ వెల్లడించింది. షార్క్స్లో ఉండే ఆ ఇమ్యునాలాజికల్ పదార్థం మొక్కల్లోనూ ఉంటుందని... కాబట్టి వ్యాక్సిన్ కంపెనీలు ఆ దిశగా దృష్టి సారించాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 3,33,64,119 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దాదాపు 10లక్షల పైచిలుకు మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా అమెరికాలో 73,73,206 కేసులు నమోదవగా భారత్లో 61,56,722 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు దేశాల్లో కలిపి 3లక్షల పైచిలుకు మంది మృతి చెందారు.