కరోనా వ్యాక్సిన్: కొవాక్స్ కూటమిలో భారత్ చేరికపై చర్చలు: WHO వెల్లడి
కరోనా మహమ్మారికి విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాలు కీలక దశకు చేరిన తరుణంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో), గవి ఆధ్వర్యంలో.. వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీలో పరస్పరం సహకరించుకునేందుకు పలు దేశాలు 'కొవాక్స్' పేరుతో కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్ సైతం ఆ కూటమిలో చేరే దిశగా చర్చలు సాగుతున్నాయని డబ్ల్యూహెచ్వో సోమవారం ప్రకటించింది.
''ప్రపంచంలోని అన్ని దేశాల మాదిరిగానే, కొవాక్స్ ఫెసిలిటీలో భాగస్తురాలయ్యేందుకు భారత్ కు అన్ని అర్హతలు ఉన్నాయి. అదీగాక టీకాల అభివృద్ధిలోనూ భారత్ కు విస్తృతమైన అనుభవం ఉంది. కొవాక్స్ లోకి భారత్ రాకను స్వాగతిస్తున్నాం. ఆ దిశగా చర్చలు కొనసాగుతున్నాయి"అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి బ్రూస్ ఐల్వర్డ్ అన్నారు. సోమవారం జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని తెలిపారు.
డబ్ల్యూహెచ్వో, గవి సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటైన కొవాక్స్ కూటమిలో ఇప్పటికే 150 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. సమర్థవంతమైన కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సరైన నిర్వహణ లేకపోతే.. పేద దేశాలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలుండటంతో దాన్ని నివారిస్తూ... అన్ని దేశాల అవసరాల్ని తీర్చే స్థాయిలో వ్యాక్సిన్ డోసుల్ని ఎలా తయారు చేయాలి? ఎలా పపిణీ చేయాలి? ముందుగా ఎవరికి ఇవ్వాలి? లాంటి అంశాలను కొవాక్స్ నిర్ణయించనుంది.
త్వరలో అందుబాటులోకి రానున్న వివిధ వ్యాక్సిన్లను యూనిసెఫ్ సంస్థ ద్వారా పపిణీ చేయాలని కొవాక్స్ కూటమి తాజాగా నిర్ణయించింది. ఇప్పటికే యునిసెఫ్ అనేక వ్యాధులకు సంబంధించి ఏటా 2 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను కొనుగోలు చేసి, దాదాపు 100 దేశాల్లో పిల్లలకు అందజేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా, కొవాక్స్ కూటమిలో తాము చేరబోమంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించడంతో నిధుల కొరతను అధిగమించే దిశగా సంస్థలు ఆలోచనలు చేస్తున్నాయి.