Alert:గుండె పై కరోనా ప్రభావం ఎంత.. యువతలో కూడా... డాక్టర్లు ఏం చెబుతున్నారు..?
కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి కొన్ని లక్షల మంది మృతి చెందారు. చైనాలో తొలి కేసు వెలుగులోకి వచ్చాక ఆ తర్వాత ప్రపంచ దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించింది. వైరస్ తొలినాళ్లలో దీనిగురించి భయాందోళనలు చెందాల్సిన పనిలేదని చాలా దేశాలు చెప్పాయి.. కానీ క్రమంగా కరోనావైరస్ మానవాళిపై పగబట్టినట్టుగా కనిపిస్తోంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కరోనావైరస్ లక్షణాలు సాధారణంగా ఒక మనిషిలో కనిపించే జబ్బు లక్షణాలతోనే పోలి ఉండటంతో కరోనా నిజంగానే సోకిందా లేదా అనేది టెస్టులు చేయించుకునేవరకు తెలియడం లేదు.
కరోనా నుంచి కోలుకుని గుండె సంబంధిత వ్యాధులు
కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా గుండెపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఓ అధ్యయనం పేర్కొంది. జామా కార్డియాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కోవిడ్-19 నుంచి కోలుకున్న 78శాతం మంది పేషెంట్లు తిరిగి గుండె సంబంధిత వ్యాధులతో హాస్పిటల్స్లో చేరుతున్నారట.ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకిన తొలినాళ్లలోనే ఇది గుండెపై ప్రభావం చూపడం మొదలవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ముందుగా శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారగానే అప్పుడే గుండె సంబంధిత వ్యాధి మొదలవుతుందని పరిశోధకులు చెప్పారు. ఇక అంతకుముందే గుండె సంబంధిత వ్యాధులు కనక ఉన్నట్లయితే వారు మరింత రిస్క్ బారిన పడే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇక కరోనా సోకి మరణించిన 22శాతం మంది పేషెంట్లు అంతకుముందే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు ఉండటం చైనాలోని సీడీసీ చేసిన పరిశోధనల్లో తేలింది.
కరోనా సోకిన వెంటనే గుండెపై ప్రభావం
కరోనా సోకిన తొలి రోజుల్లో ఆ బాధితుడి గుండెపై ప్రభావం చూపుతుందని ఆ తర్వాత క్రమంగా గుండె పనితీరులో కొంత తేడా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది వైరస్ నేరుగా గుండెను తాకడంతో ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఊపిరితిత్తులపై అధిక ఒత్తిడి పడటంతో గుండెపోటు వస్తుందని చెబుతున్న వైద్యులు... గుండెపోటు వృద్ధుల్లో అధికంగా ఉంటాయని చెబుతున్నారు. ఇక అదే యవ్వన వయస్సు ఉన్న వారిలో కరోనాతో గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని తాము గమనించినట్లు వైద్యులు చెప్పారు. ఇక వైరస్ను తగ్గుముఖం పట్టించేందుకు ఇస్తున్న యాంటీ వైరల్ మరియు యాంటి ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ గుండెపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. అందుకే కరోనా రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా ఉంటామని పరిశోధకులు చెబుతున్నారు.
వైద్యులు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు..?
ఇక గుండె పనితీరు ఎలాగుందో తెలుసుకునేందుకు కొన్ని లక్షణాలు పై దృష్టి సారించాలని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం వచ్చినప్పుడు తేలిగ్గా తీసుకోరాదని సూచిస్తున్నారు. అంతేకాదు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీ నొప్పి లేదా ఒత్తిడిలా అనిపించినా, గందరగోళంగా అనిపించినా, ముఖం నీలం రంగులో లేదా పెదాలు నీలం రంగులోకి మారినా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా మీ గుండెకు ముప్పుందని భావించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు మీరు సురక్షితంగా ఉండాలంటే మీరు రోజు తీసుకుంటున్న ఆహారంపై దృష్టి సారించాలని చెబుతున్నారు. నిత్యం వ్యాయామం, సిగరెట్కు గుడ్ బై చెప్పడం, కొలెస్ట్రాల్ మరియు రక్తపోటులను నియంత్రణలో ఉంచుకోవడం వంటిపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. పైన సూచించిన అంశాలను విస్మరిస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా గుండె సంబంధిత వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించి మెడికల్ టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు.