కరోనా : పిల్లల్లో బయటపడుతున్న 'పెర్నియో'.. ఏంటీ కొత్త లక్షణం..?
జ్వరం,పొడి దగ్గు,జలుబు,తలనొప్పి.. ఇవి మాత్రమే ఇప్పటిదాకా కరోనా వైరస్ లక్షణాలుగా భావిస్తున్నాం. కొంతమందిలో ఏ లక్షణాలూ లేకుండానే వైరస్ పాజిటివ్గా నిర్దారణ అవడమూ చూస్తున్నాం. యూరోప్,అమెరికా లాంటి దేశాల్లో అయితే విచిత్రమైన లక్షణాలు సైతం బయటపడుతున్నాయి. అక్కడి డెర్మటాలిస్టులు(చర్మ వైద్య నిపుణులు) కరోనా వైరస్ సోకిన పిల్లల పాదాలు,కాలి వేళ్లపై వాపు,పొక్కులు వంటి లక్షణాలను గమనించారు. అంతేకాదు,కొంతమంది వివర్ణత్వం(రంగులు సరిగా అగుపించకపోవడం) అనే సమస్యతోనూ బాధపడుతున్నట్టు గుర్తించారు.
ఇటలీలో పెర్నియో..
కరోనా సోకిన పేషెంట్లలో ఇలా పాదాలు,కాలి వేళ్లపై వాపు,పొక్కులు రావడాన్ని పెర్నియోగా పిలుస్తారు. సాధారణంగా చలి తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాలి వేళ్లపై పొక్కులు,కండరాలల్లో వాపు కారణంగా విపరీతమైన మంట కూడా ఉంటుంది. ఈ లక్షణాలను 'Covid Toes' అని కూడా పిలుస్తున్నారు. ఇటలీలో కోవిడ్-19 పేషెంట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అక్కడి డెర్మటాలజిస్టులు ఈ లక్షణాలను గుర్తించారు. ఇప్పుడివే లక్షణాలు అమెరికాలోనూ బయటపడ్డాయి.
అమెరికాలోనూ..
అమెరికాలోని బోస్టన్ ప్రాంతంలోని డెర్మటాలజిస్టులు పలువురు చిన్నారుల కాలి వేళ్లపై పొక్కులను గుర్తించారు. దీంతో అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీతో భాగస్వాములైన వైద్యులు ఇలాంటి లక్షణాలతో తమవద్దకు వచ్చే చిన్నారులను కరోనా టెస్టుల కోసం పంపిస్తున్నారు. ఇటలీలో ఇలాంటి లక్షణాలతో డెర్మటాలజిస్టుల వద్దకు వచ్చిన చిన్నారుల్లో పొడి దగ్గు,జలుబు,తలనొప్పి,జ్వరం వంటి లక్షణాలేవి లేకపోవడం గమనార్హం. ఈ కొత్త వింత పరిణామాలు వైద్యులకు సవాల్గా మారాయి.
Recommended Video
వ్యాక్సిన్ ప్రయోగాలకు సవాల్...
ఇప్పటికే కరోనా లక్షణాలేవి లేని పాజిటివ్ కేసులు కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇలాంటి కేసులను గుర్తించేందుకు యాంటీబాడీస్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా పేషెంట్లలో కొత్తగా ఇలా చర్మ సంబంధిత సమస్యలు కూడా రావడం,మరికొందరిలో రక్తం గడ్డ కట్టడం,బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు కూడా వస్తుండటం సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఓవైపు వైరస్కు వ్యాక్సిన్ కొనుగొనే ప్రయత్నాలు జరుగుతుండగానే.. ఇలా కొత్త లక్షణాలు కూడా పుట్టుకురావడం వ్యాక్సిన్ ప్రయోగాలకు కూడా సవాల్గా మారింది.