ఎమిరేట్స్ సంచలనం: పాకిస్తాన్ సహా: డజను దేశాలకు విసాల నిలిపివేత: మళ్లీ ఎప్పటికో
అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పాకిస్తాన్ సహా 11 దేశాలకు విజిటర్స్ విసాలను తాత్కాలికంగా నిలిపివేసింది. విజిటింగ్ విసాల జారీని రద్దు చేసింది. మళ్లీ ఎప్పుడు వాటిని పునరుద్ధరిస్తారనేది వెల్లడించలేదు. ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభం కావడం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచంలో అత్యధికులు సందర్శించే దేశాల్లో ఒకటిగా, లక్షలాది మందికి ఉపాధిని కల్పించే అరబ్ కంట్రీగా గుర్తింపు పొందిన ఎమిరేట్స్.. ఈ నిర్ణయాన్ని తీసుకోవడం చర్చనీయాంశమౌతోంది.
Recommended Video
కొన్ని దేశాల్లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభమైనట్టు కనిపిస్తోందని, ముందుజాగ్రత్త చర్యగా విజిటర్స్ విసాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఎమిరేట్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జహీద్ హఫీజ్ చౌధ్రీ తెలిపారు. పాకిస్తాన్, టర్కీ, ఇరాన్, యెమెన్, సిరియా, ఇరాక్, సొమాలియా, లిబియా, కెన్యా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు ఈ విసాలను జారీ చేయడాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఇది తాత్కాలికమే అయినప్పటికీ.. ఎప్పుడు పునరుద్ధరించాలనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని తెలిపారు. కరోనా తీవ్రతను అడ్డుకోవడంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని స్పష్టం చేశారు.
పాకిస్తాన్లో వారం రోజుల వ్యవధిలో కొత్తగా రెండువేలకు పైగా కరోనా వైరస్ కేసులు పుట్టుకొచ్చాయి. మొత్తం మీద ఆ దేశంలో 3,63,380 కేసులు నమోదు అయ్యాయి. 7,230 మంది కరోనా బారిన పడి మరణించారు. 30,362 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారం రోజుల్లో రెండువేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడాన్ని అటు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలతో కూడిన లాక్డౌన్ను విధించింది. ఎమిరేట్స్ నుంచి తాత్కాలికంగా విసాల నిలిపివేతను ఎదుర్కొంటోన్న దేశాల్లోనూ కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి.