చైనాలో మాస్ వ్యాక్సినేషన్: 10 లక్షల మందికి టీకా: గుట్టు చప్పుడు కాకుండా
బీజింగ్: లక్షలాదిమంది ప్రాణాలను హరించి వేస్తోన్న భయానక కరోనా వైరస్కు జన్మనిచ్చిన చైనా..గుట్టుచప్పుడు కాకుండా మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వ్యాక్సిన్ తయారీ కోసం అనేక దేశాలు మల్లగుల్లాలు పడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని తయారు చేయడమే కాదు.. వ్యాక్సినేషన్కు కూడా నిర్వహిస్తోంది. ఇప్పటిదాకా 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు చైనా అధికారికంగా ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల కింద వ్యాక్సినేషన్ నిర్వహించినట్లు పేర్కొంది.
ఈ వ్యాక్సిన్ను చైనా అధికారిక ఫార్మాసూటికల్ కంపెనీ తయారు చేసింది. వ్యాక్సినేషన్ సందర్భంగా ఏ ఒక్కరికీ సైడ్ ఎఫెక్ట్ వచ్చినట్లు సమాచారం లేదని చైనా జాతీయ ఫార్మాసూటికల్స్ గ్రూప్ సినోఫార్మ్ ఛైర్మన్ లియు జింగ్ఝెన్ తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత.. కొందరిలో అనారోగ్య లక్షణాలు కనిపించినప్పటికీ.. వాటి తీవ్రత నామమాత్రమేనని పేర్కొన్నారు. కరోనా వైరస్ను నిర్మూలించడానికి మాస్ వ్యాక్సినేషన్ను చేపట్టిన విషయాన్ని చైనా బహిరంగంగా వెల్లడించలేదు. తాజాగా సినోఫార్మ్ ఛైర్మన్ లియు జింగ్ఝెన్ చేసిన తాజా వ్యాఖ్యలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వ్యాక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు సంబంధించిన కొన్ని అధ్యయనాలు, వాటి డేటా వివరాలను చైనా ఫార్మాసూటికల్స్ కంపెనీలు దాచి పెడుతున్నాయంటూ వచ్చిన వార్తలను సినోఫార్మ్ ఛైర్మన్ తోసిపుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాస్ వ్యాక్సినేషన్ విషయాన్ని వెల్లడించారు. 10 లక్షల మంది జనాభాకు తాము వ్యాక్సిన్ వేశామని, వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్టులు గానీ, ఇతరత్రా అనారోగ్య సమస్యలు గానీ రాలేదని చెప్పారు.
Recommended Video
సినోవాక్ బయోటెక్-సినోఫార్మ్ సంయుక్తంగా వ్యాక్సిన్ను రూపొందించాయని, హైరిస్క్ గ్రూప్ వారికి ప్రాధాన్యత కింద వ్యాక్సినేషన్ చేసినట్లు సినోఫార్మ్ జాబ్స్ ప్రతినిధి గ్ఝెఝియాంగ్ తెలిపారు. తూర్పు చైనా ప్రావిన్స్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించామని, అందుకే ప్రాధాన్యత క్రమంలో వారికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ కోసం ఇదివరకే తొలి, మలిదశల్లో ట్రయల్స్ను పూర్తి చేశామని, 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయస్సున్న అరోగ్యవంతులపై ప్రయోగాలు చేసినట్లు వెల్లడించారు.