మొబైల్ ఫోన్ పేలి క్రెడిల్ ఫండ్ కంపెనీ సీఈఓ మృతి
న్యూఢిల్లీ: ఛార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ పేలి మలేషియాకు చెందిన క్రెడిల్ ఫండ్ కంపెనీ సీఈఓ నాజ్రిన్ హసన్ మృతి చెందారు. గత వారం ఆయన నివాసంలో రెండు ఫోన్ల(ఒకటి బ్లాక్ బెర్రీ, మరోటి హవాయి)కు ఛార్జింగ్ పెట్టగా అందులో ఒకటి పేలింది.
పడక గదిలో ఫోన్లకు ఛార్జింగ్ పెట్టి ఆయన వాటి పక్కనే ఉన్నారు. అకస్మాత్తుగా రెండు ఫోన్లలో ఒక ఫోన్ పేలి మంటలు చెలరేగి గది అంతటా మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా కాలిపోయింది. దీంతో ఏ ఫోన్ పేలిందో తెలియలేదు.
గదిలో మంటలు వ్యాపించడం వల్ల హసన్ మరణించారని, ఫోన్ ముక్క తల వెనుక భాగంలో బలంగా తగలడం వల్ల చనిపోయారని రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, పోలీసులు మాత్రం ఆయన పొగతో నిండిపోయిన గదిలో చిక్కుకుపోయి ఆ పొగ పీల్చడం వల్ల ఊపిరాడక చనిపోయారని చెప్పారు.
కాగా, హసన్ పక్కనే ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పేలిన కారణంగా ఏర్పడిన గాయాలతో మరణించారని పోస్టుమార్టం నివేదిక తేల్చిందని క్రెడిల్ ఫండ్ అధికారికంగా వెల్లడించింది. మలేషియా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన క్రాడిల్ ఫండ్ కంపెనీ యువ వ్యాపారవేత్తలకు, స్టార్టప్లకు నిధుల సహాయం చేస్తుంది. నాజ్రిన్ హసన్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.