భారత్ వ్యతిరేక కుట్రలపై ఆగ్రహం- నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో సంక్షోభం- రంగంలోకి చైనా..
దశబ్దాలుగా భారత్ కు మిత్రదేశంగా ఉన్న నేపాల్ తాజాగా చైనాకు అనుకూలంగా మారిపోవడం అక్కడి ప్రజలతో పాటు అధికార కమ్యూనిస్టు పార్టీ పెద్దలూ జీర్ణించుకోలేకపోతున్నారు. దీనంతటికీ కారణమైన ప్రధాని ఓలీని పదవి నుంచి దింపే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకోసం ఉద్దేశించిన కమ్యూనిస్టు పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. అయినా కమ్యూనిస్టు పార్టీ కో ఛైర్మన్ గా ఉన్న ప్రచండ ఎలాగైనా ఓలీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే చైనా నుంచి ఎదురవుతున్న ఒత్తిడి ఇబ్బందికరంగా మారింది..
సంక్షోభం అంచున నేపాల్ సర్కార్..
భారత్ కు చిరకాల మిత్రదేశంగా ఉంటూ పలు ప్రయోజనాలు పొందిన నేపాల్... తాజాగా చైనా సరిహద్దుల్లో గల్వాన్ ఘటన నేపథ్యంలో పిల్లి మొగ్గలు వేయడం మొదలుపెట్టింది. భారత్ లో కాలాపానీ, లిపులేఖ్, లింపియాథురా ప్రాంతాలు తమవేనంటూ ఓ వివాదం మొదలుపెట్టిన ప్రధాని ఓలీ.. ఆ తర్వాత ఏకంగా రాముడి జన్మస్ధలం తమ దేశంలోనే ఉందంటూ మరో వివాదం రేపారు. అయితే ఇదంతా చైనాకు దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలని అర్దమవుతూనే ఉంది. వీటిపై ఆగ్రహంగా ఉన్న అధికార కమ్యూనిస్టు పార్టీ పెద్దలు ఆయన్ని సాగనంపేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఓలీ భవితవ్యాన్ని తేల్చేందుకు ఉద్దేశించిన పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించేందుకు ప్రచండ వర్గం ప్రయత్నిస్తుండగా.. ఓలీ వర్గం మాత్రం దాన్ని నిర్వహించకుండా అడ్డుపడుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన సమావేశం మరోసారి వాయిదా పడింది.
చీలిక దిశగా అధికార పార్టీ...
భారత్ కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటూ రోజుకో వివాదం తీసుకొస్తున్న ప్రధాని ఓలీని ఎలాగైనా గద్దె దింపేందుకు నేపాల్ కమ్యూనిస్టు పార్టీలోని ప్రచండ వర్గం ప్రయత్నిస్తోంది. అయితే చైనా మద్దతున్న ఓలీ ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పార్టీలో చీలిక తీసుకొచ్చి అయినా తన పదవి కాపాడుకునేందుకు ఓలీ ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రచండ వర్గం కూడా పార్టీ చీలిపోకుండా ఉండేందుకు పలు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం ముందు పెడుతోంది. ఇందులో ప్రచండ వర్గానికి చెందిన పలువురిని ఓలీ కేబినెట్ లో చేర్చుకోవడం ఓ అంశం. దీంతో వీటిని ఓలీ ప్రస్తుతానికి పరిశీలించవచ్చనే ప్రచారం జరుగుతోంది.
రాజీనామాకు నిరాకరిస్తున్న ఓలీ...
చైనా అండతో పాత మితృత్వాన్ని వదిలిపెట్టి మరీ భారత్ వ్యతిరేక వైఖరిని అవలంబించేందుకు సిద్ధమైన ప్రధాని కేపీ ఓలీ.. పార్టీలో ప్రచండ వర్గం ఒత్తిడికి తలొంచి గద్దె దిగేందుకు నిరాకరిస్తున్నారు. నేపాల్ భవిష్యత్తు కోసం తన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్న ఓలీ... ప్రచండ వర్గాన్ని చల్లార్చేందుకు పలు నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. అవసరమైతే ప్రచండ వర్గానికి చెందిన మరికొందరికి ఈ నెలాఖరులోగా కేబినెట్ లోకి తీసుకునేందుకు కూడా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా భారత్ వ్యతిరేక వైఖరి నుంచి వెనక్కి తగ్గేందుకు ఓలీ సిద్ధం కాకపోవడం సమస్యకు ఆజ్యం పోస్తోంది.
Recommended Video
రంగంలోకి దిగిన చైనా...
సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్ పొరుగుదేశమైన నేపాల్ ను దువ్వుతున్న చైనా.. తాజా సంక్షోభానికి పరోక్షంగా కారణమవుతోంది. అయినా చైనా మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. కానీ కమ్యూనిస్టు పార్టీలో సంక్షోభం ముదిరి ప్రచండ, కేపీ ఓలీ వర్గాలు వేరు కుంపట్లు పెట్టుకుంటే మాత్రం ప్రభుత్వం పతనం కావడం ఖాయం. అప్పుడు భారత్ కు వ్యతిరేకంగా తాను వేసిన బిగ్ ప్లాన్ చిత్తు కావడం ఖాయం. దీంతో నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో నెలకొన్న సంక్షోభాల పరిష్కారానికి ఆ దేశంలోని తమ రాయబారి హూయాంకీని రంగంలోకి దింపింది. వాస్తవానికి నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు చైనా రాయబారికి ఎలాంటి అధికారాలు లేవు. కానీ తాజా సంక్షోభం ముదరకముందే పరిస్ధితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది.