ఓవల్లో విజయ్ మాల్యాకు షాక్... దొంగ దొంగ అంటూ తరిమిన క్రికెట్ అభిమానులు
లండన్ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేలకోట్ల పంగనామం పెట్టి లండన్కు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఐసీసీ వరల్డ్ కప్లో భాగంగా ఆదివారం ఓవల్ గ్రౌండ్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చి తిరిగివెళ్తున్న మాల్యాకు ప్రేక్షకులు షాక్ ఇచ్చారు. మాల్యాను చూసిన జనం దొంగ దొంగ అని అరవడం మొదలుపెట్టారు. దేశానికి క్షమాపణ చెప్పు అనే నినాదాలతో హోరెత్తించారు.
దొంగ దొంగ అంటూ జనం నినాదాలు చేయడంపై విలేకరులు ప్రశ్నించగా.. మాల్యా తాను మ్యాచ్ చూడ్డానికి వచ్చానని, జులైలో జరగనున్న తదుపరి విచారణకు సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పారు. అలాగే తన తల్లిలాంటి దేశం బాధపడకుండా చూడాలనేది తన ప్రయత్నమని చెప్పాడు.
అంతకు ముందు ఇంగ్లండ్లో జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న మాల్యా భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్కు తన కొడుకు సిద్ధార్థ్ మాల్యాతో కలిసి వచ్చాడు. ఆస్ట్రేలియాపై ఇండియా విజయం సాధించిన మ్యాచ్ను తన కొడుకుతో కలిసి మ్యాచ్ చూడటం సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత టీమ్కు అభినందనలు తెలిపాడు.
క్రికెట్ మ్యాచ్లను తరచుగా వీక్షించే మాల్యాకు గతంలోనూ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. 2017లో ఇండియా - సౌతాఫ్రికా మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ సందరంభంగా మాల్యాకు ఇలాంటి అవమానమే ఎదురైంది. అప్పట్లో మ్యాచ్ తిలకించేందుకు వచ్చిన ఆయనను చూసిన జనం దొంగ దొంగ అని నినాదాలు చేశారు. ఎస్బీఐ కన్సార్టియం నేతృత్వంలోని 13 బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్ మాల్యా 2016 మార్చి 2న భారత్ నుంచి పారిపోయాడు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈడీ ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదుచేసింది.