సరిహద్దు ఉద్రిక్తతలు... రష్యాలో ముగిసిన భారత్-చైనా విదేశాంగ మంత్రుల భేటీ...
రష్యాలోని మాస్కో వేదికగా జరిగిన షాంఘై కోఆపరేషన్ సదస్సులో భారత్-చైనా విదేశాంగ మంత్రుల మధ్య భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు ఉద్రిక్తతలు,సైన్యం ఉపసంహరణ ప్రక్రియపై చర్చించారు.సరిహద్దులో శాంతిని నెలకొల్పాల్సిన అవసరాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ నొక్కి చెప్పారు.భారత బలగాలు స్టేటస్ కోని మార్చేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు.ఈ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.జైశంకర్-వాంగ్ యి భేటీకి కొద్దిసేపటి ముందు చైనా మీడియా గ్లోబల్ టైమ్స్.. రెండు దేశాల మధ్య శాంతి తీర్మానానికి ఇక ఇదే చివరి అవకాశం అని పేర్కొనడం గమనార్హం.
ఇక ఇదే సదస్సులో రష్యా-భారత్-చైనా చర్చలపై భారత్లోని రష్యా రాయబార కార్యాలయం కీలక విషయాలు వెల్లడించింది. మూడు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే చర్యలపై చర్చించినట్లు తెలిపింది. ప్రాంతీయ,అంతర్జాతీయ ప్రాధాన్యత,పరస్పర అవగాహన,స్నేహపూర్వక సంబంధాలు,నమ్మకం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపింది.
ప్రపంచ అభివృద్ది,శాంతి,సుస్థిరతకు తమవంతుగా మూడు దేశాలు కామన్ డెవలప్మెంట్,కోఆపరేషన్కు కట్టుబడి ఉండాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇటు సైంటిఫిక్గా, అటు పరిశ్రమల సామర్థ్యం పరంగా బలమైన ఈ 3 దేశాలు కోవిడ్ 19 ప్రభావాన్ని తగ్గించడంలో గణనీయమైన సహకారాన్ని అందించగలవని మూడు దేశాల విదేశాంగ మంత్రులు అభిప్రాయపడినట్లు పేర్కొంది.
మూడు దేశాల మధ్య సమావేశాలకు గత ఏడాది కాలంగా వేదికగా నిలుస్తున్న రష్యాకు భారత్,చైనా విదేశాంగ మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రష్యా-ఇండియా-చైనా(RIC) ఛైర్మన్షిప్ను భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రొవ్ అధికారికంగా అప్పగించారు.
Recommended Video
కాగా, ఇదే షాంఘై వేదికగా గత శుక్రవారం భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్,చైనా రక్షణ శాఖ మంత్రి పార్ట్ ఫెంఝీతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఎలాంటి అవగాహన కుదురకుండానే ఆ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. పైగా సరిహద్దు ఉద్రిక్తతలకు పూర్తి బాధ్యత భారత్దేనని చైనా దుందుడుకు వ్యాఖ్యలు చేసింది. ఓవైపు సంప్రదింపులు,చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని చెబుతూనే... మరోవైపు సమస్యను మరింత జటిలం చేసేలా నోటికి పని చెబుతోంది. అయితే చైనా వ్యాఖ్యలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతోంది. చైనీస్ ఆర్మీ వల్లే సరిహద్దులో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది.