చైనాకు అమెరికా మరో షాక్: డ్రోన్ల వ్యాపారానికి భారీ దెబ్బ
చైనాకు మరోసారి అమెరికా షాకిచ్చింది.సైబర్ ముప్పు పొంచి ఉందనే కారణంగా చైనాకు చెందిన డీజేఐ సంస్థ డ్రోన్లను వాడకూడదని అమెరికా సైన్యం నిర్ణయించింది.
వాషింగ్టన్: చైనాకు మరోసారి అమెరికా షాకిచ్చింది. సైబర్ ముప్పు పొంచి ఉందనే కారణంగా చైనాకు చెందిన డీజేఐ సంస్థ డ్రోన్లను వాడకూడదని అమెరికా సైన్యం నిర్ణయించింది. ఈ క్రమంలో చైనా సంస్థ ఎస్జడ్ డీజేఐ టెక్నాలజీ కంపెనీకి చెందిన ఈ డ్రోన్ల వాడకాన్ని నిలిపివేయాలంటూ ఆ దేశ సైన్యాధికారులకు ఆదేశాలు జారీచేసింది.
'ఆ డ్రోన్ల వినియోగాన్ని నిలిపివేయండి. డీజేఐ అప్లికేషన్లను అన్ఇన్స్టాల్ చేసుకోండి. బ్యాటరీ, స్టోరేజ్ మీడియా తదితర విభాగాలను తొలగించండి. తమ ఆదేశానుసారం సురక్షితమైన పరికరాలను అమర్చుకోండి'అని ఆగస్టు 2న రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొంది. ఇప్పటికే అమెరికా అధికమొత్తంలో ఈ కంపెనీకి చెందిన పరికరాలను వాడుతున్నట్టు సదరు లేఖ వెల్లడిస్తోంది.
కాగా, డీజేఐకు సంబంధించిన ఈ డ్రోన్ యంత్ర పరికరాలతో సైబర్ ముప్పు పొంచి ఉందని ఆర్మీ రీసెర్చి లేబోరేటరీ, నేవీ ఇచ్చిన సమాచారం మేరకు అమెరికా సైన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికా సైన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై డీజేఐ సంస్థ స్పందించింది.
డీజేఐ డ్రోన్లపై నిబంధనలు విధించే ముందు తమను కనీసం సంప్రదించకపోవడం బాధించిందని పేర్కొంది. అంతేగాకుండా అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపింది. సైబర్ ముప్పు పొంచి ఉందనే ఆరోపణలపై అమెరికా ఆర్మీని వివరణ కోరనున్నట్టు డీజేఐ ప్రతినిధులు తెలిపారు.