పాక్ సైన్యంతో విభేదాలు నిజమే: షరీఫ్కు మీడియా మరో షాక్, 'చైనా లేకుంటే..'
కరాచీ: భారత్ సర్జికల్ స్ట్రయికల్ దాడులు జరిపిన అనంతరం ఈ నెల ఆరవ తేదీన డాన్ పత్రిక ప్రచురించిన కథనంలోని విషయాలు వాస్తవమేనని డాన్ ఎడిటోరియల్ పేర్కొంది. కథనం రాసిన జర్నలిస్టు సిరిల్ అల్మీదాను దేశం విడిచి వెళ్లవద్దంటూ పాక్ ప్రభుత్వం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో స్పందించిన డాన్ పత్రిక ఎడిటర్ రియాక్షన్ టు డాన్ స్టోరీ పేరుతో ఎడిటోరియల్ రాశారు. వార్తను పూర్తిగా పరిశీలించామని, ఒకటికి పదిసార్లు వాస్తవాలను పూర్తిగా నిర్ధారించుకున్నాకే ప్రచురించామని ఈ ఎడిటోరియల్లో పేర్కొన్నారు. ఈ వార్తకు పూర్తి బాధ్యత తమదేనంటూ స్పష్టం చేశారు.
జర్నలిజం నియమనిబంధనలకు అనుగుణంగానే తమ వార్త ఉందన్నారు. పత్రిక విలువలను తుంగలోకి తొక్కినప్పుడు ఏ పత్రికపై అయినా చర్యలు తీసుకోవాల్సిందేనని, ఇందుకు డాన్ అతీతం కాదన్నారు. అయితే తాము ప్రచురించిన వార్తలో అవాస్తవాలు లేవని, పూర్తి ఆధారాలతో ప్రచురించామన్నారు. దీంతో జర్నలిస్టుపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
సిరిల్ అల్మైదా స్టోరీతో పాక్ ప్రభుత్వం వెన్నులో వణుకు
డాన్ జర్నలిస్ట్ సిరిల్ అల్మిదా రాసిన స్టోరీతో పాక్ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టింది. ప్రధాని షరీఫ్ ఆగ్రహానికి డాన్ పత్రిక జర్నలిస్ట్ గురయ్యాడు. ప్రభుత్వానికి, ఆర్మీకి చెడిందంటూ సంచలన వార్త రాసి నవాజ్ షరీఫ్కు చెమటలు పట్టించాడు. అతను దేశం విడిచి వెళ్లవద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
అయితే పాక్ మీడియా మాత్రం ఆ జర్నలిస్టుకు అండగా నిలబడింది. అల్మిదా భయపడాల్సింది లేదని, ఇంతకుముందులాగే పెన్ను ఝులిపించాలని ది నేషన్ పత్రిక పేర్కోంది. అదే సమయంలో ప్రభుత్వానికి హితవు పలికింది. వ్యతిరేకంగా వార్తను ప్రచురించారన్న నెపంతో జర్నలిస్టును క్రిమినల్లా చూడవద్దన్నారు.
చైనా లేకుంటే పాక్కు సత్తా లేదు: బెలూచిస్తాన్ నాయకురాలు
పాకిస్థాన్కు చైనా నుంచి సహకారం లేకపోతే ఆ దేశానికి ఏ దేశంపైనా యుద్ధం చేసే సత్తా లేదని బెలూచిస్థాన్ స్వాతంత్ర్య ఉద్యమ నాయకురాలు, ప్రపంచ బలూచ్ మహిళా ఫోరం అధ్యక్షురాలు నాయేలా బలూచ్ అన్నారు. ఆమె ఢిల్లీలో మాట్లాడారు. పీవోకేలో భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్ దాడులకు మద్దతు తెలిపారు. పాక్పైన కూడా అటువంటి దాడులు జరపాలన్నారు.