కరోనాతో దావూద్ ఇబ్రహీం మృతి ? అండర్ టేకర్, ఫాంటమ్ తో పోలిక- ఎన్నిసార్లు చస్తాడంటూ ఫైర్....
ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనాతో బాధపడుతూ చనిపోయాడని నెట్ ప్రపంచం హోరెత్తుతుంది. చాలా సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త వైరల్ అవుతున్నా ఎక్కడా నిర్ధారణ కావడం లేదు. దీంతో గతంలోలాగే ఈసారి కూడా దావూద్ చనిపోయాడన్నది కేవలం పుకారేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినా నెట్లో జనం మాత్రం ఈ వార్తపై స్పందిచడం, షేర్ చేయడం మానడం లేదు.
దావూద్ మృతి నిజమేనా?
పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న ముంబై అండర్ వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం కరోనా కారణంగా చనిపోయాడంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. కరాచీకి చెందిన ఓ మీడియా ప్రతినిధి దావూద్ కు కరోనా సోకిందనే అంశాన్ని ట్విట్టర్ లో షేర్ చేయగానే దావూద్ మృతి అంటూ వార్తలు వైరల్ అయిపోయాయి. వీటిని వేల సంఖ్యలో నెటిజన్లు షేర్ కూడా చేసేశారు. అయితే దావూద్ ఆచూకీపై గానీ, ఆయన ఆరోగ్యంపై కానీ ఇప్పటికీ పాకిస్తాన్ నుంచి కానీ ఇతర దేశాల్లోని అతని అనుచరుల నుంచి కానీ ఎలాంటి స్పందనా రాలేదు.
Recommended Video
గతంలో చాలా సార్లు...
దావూద్ ఇబ్రహీం మృతికి సంబందించి గత దశాబ్ద కాలంలోనే ఎన్నోసార్లు ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆయన చనిపోయినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదు. చనిపోయాడని పుకార్లు బయటికి వచ్చిన కొన్నిరోజులకే ఆయన ఎక్కడో ఓ చోట హల్ చల్ చేస్తున్న ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటిక రావడం సర్వసాధారణమవుతోంది. దీంతో దావూద్ మృతి అంటే చాలు అదో రూమర్ గానే చాలా మంది పరిగణిస్తుంటారు.
నెటిజన్ల ఫైర్...
దావూద్ మృతిపై ఎలాంటి అధికారిక సమాచారం లేకుండానే ట్విట్టర్ తో పాటు పలు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఇప్పుడు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో డబ్ల్యూడబ్ల్యూఈ వీరులు అండర్ టేకర్, ఫాంటమ్ విషయంలోనూ ఇలాగే ఎన్నోసార్లు వారిని చంపేశారని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. అండర్ టేకర్, ఫాంటమ్ తరహాలోనే దావూద్ ను కూడా ఎన్నిసార్లు చంపుతార్రా అంటూ ట్విట్టర్ లో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ప్రపంచంలో ఎక్కువ సార్లు చనిపోయిన వ్యక్తి దావూద్ ఇబ్రహీమేనా అంటూ ఫన్నీ ప్రశ్నలు వేస్తున్నారు.