ఇండియాకు సవాల్: పాక్లో దావూద్ స్థావరం ఇదే
కరాచీ: దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడనేది పాకిస్తాన్ బుకాయింపు మాత్రమేనని తేలిపోయింది. గత 23 ఏళ్లుగా పాకిస్తాన్ బుకాయిస్తూ వస్తోంది. అతడు పాకిస్తాన్లోనిి కరాచీలో ఒక భారీ విలాస భవనంలో ఉంటున్నాడనే విషయం సీఎన్ఎన్-న్యూస్18 స్టింగ్ ఆపరేషన్లో నిర్ధారణ అయింది.
'ఇదిగో, ఇదీ దావూద్ ఇబ్రహీం కరాచీ అడ్రస్.. డి13, బ్లాక్ 4, క్లిఫ్టన్, కరాచీ' అంటూ న్యూస్ 18 చానల్ వీడియో ఆధారాలతో సహా దాన్ని బయటపెట్టింది. ఆ వీడియోలో దావూద్ ఇబ్రహీందిగా పేర్కొంటున్న ఇంటి పై భాగం, పక్కనే క్రికెట్ స్టేడియం, కరాచీలోనే ప్రముఖ కల్యాణమండపం మరోపక్క ఉన్నాయి.
దావూద్ ఇబ్రహీం నివాసం అబొట్టాబాదులోని ఒసామా బిన్ లాడెన్ స్థావరం మాదిరిగానే ఉందని స్టింగ్ ఆపరేషన్లో బయటపడింది.తమకు తెలిసిన ఒక కాంట్రాక్టరు ప్రస్తుతం దావూద్ బంగ్లాలో పనిచేస్తున్నాడని, అతడు తమకు కొంత డబ్బు ఇవ్వాల్సి ఉందని, కాబట్టి దావూద్ ఇంటి అడ్రస్ చెప్పాలని చానల్ ప్రతినిధులు అడిగారు.
పక్కవీధిలో మసీదు పక్కనే దావూద్ ఇల్లు ఉంటుందని, కాకపోతే అక్కడ గేటు లాంటివి ఉండవని కంచె వేసి ఉంటుందని ఓ అప్ఘనిస్తాన్ శరణార్థి చెప్పాడు. అక్కడికి వెళ్లి కంచె వద్ద ఉన్న గార్డులను ప్రశ్నించగా వారు కూడా అది దావూద్ ఇబ్రహీం ఇల్లనే చెప్పారు. లోపల ఎలాంటి పనీ జరగట్లేదని, ఏ కాంట్రాక్టరూ లోపల లేడని చెప్పారు.
మూడు మీటర్ల ఎత్తైన ప్రహరీ ఉందని, ప్రతిక్షణం ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల పహరా ఉంటుందని వివరించారు. లోపల ఒక మసీదు కూడా నిర్మించారని వెల్లడించింది.
స్టింగ్ ఆపరేషన్లో దావూద్ ఇంటి చిరునామా కనుగొన్నామంటూ సీఎన్ఎన్-న్యూస్ 18 చానల్ ప్రసారం చేసిన కథనం విస్తృతంగా ప్రచారం కావడంతో దీనిపై దావూద్ అనుచరుడు చోటాషకీల్ స్పందించాడు. దమ్ముంటే దావూద్ను పట్టుకోవాలని భారత ప్రభుత్వాన్ని సవాల్ చేశాడు. కాగా, పాకిస్థానీ ప్రభుత్వం ఎప్పటిలాగానే తమ దేశంలో లేడని ప్రకటించింది.