దావూద్కు 21పేర్లు, పాక్లోనే మూడు అడ్రస్లు: యూకే
భారత మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన కీలక సమాచారాన్ని బ్రిటన్ ప్రభుత్వం బయటపెట్టింది. పాకిస్థాన్లో దావూద్ 21మారుపేర్లతో చలమణీ అవుతున్నాడని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది.
లండన్: భారత మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన కీలక సమాచారాన్ని బ్రిటన్ ప్రభుత్వం బయటపెట్టింది. పాకిస్థాన్లో దావూద్ 21మారుపేర్లతో చలమణీ అవుతున్నాడని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. అంతేగాక, పాక్లో అతనికి మూడు చిరునామాలు కూడా ఉన్నాయని గుర్తించింది.
బ్రిటన్ ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన ఆంక్షల జాబితాలో ఉన్న భారతయ జాతీయుడు దావూద్ ఒక్కడే ఉండటం గమనార్హం. జాబితాలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఖేర్లో అతడు పుట్టాడు. అతడి తండ్రి పేరు షేక్ ఇబ్రహీం అలీ కస్కర్ని, తల్లి అమినా. భార్య మెహ్ జాబీన్ షేక్.
దావూద్ వద్ద భారత పాస్ పోర్టు కూడా ఉండేది. దాన్ని ఆ తర్వాత భారత్ రద్దు చేసింది. అతడి వద్ద భారత్, పాక్కు సంబంధించిన అనేక పాస్ పోర్టులు ఉండేవని, వాటిని అతడు దుర్వినియోగం చేశాడని పేర్కొంది.
260 మంది ప్రాణాలను బలిగొన్న 1993 నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ప్రధాన నిందితుడనే విషయం తెలిసిందే. ఆ మారుణకాండ తర్వాత అతడు పాక్కు పరారై, అక్కడి నుంచే నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు.
అయితే పాక్ ఆ విషయాన్ని ఎప్పుడూ ఖండించేది. బ్రిటన్ ఆర్థిక ఆంక్షల జాబితాలో ఎల్టీటీఈ, ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్, హిజ్బుల్ ముజాహిదీన్లు కూడా ఉన్నాయి. అల్ఖైదా, ఐసిస్ వంటి ముష్కర ముఠాలనూ ఈ జాబితాలో చేర్చారు. కాగా, ఈ సంస్థలకు నిధులు బట్వాడా చేయడంపై నిషేధం ఉంది.