కరాచీలోనే దావూద్, అడ్రస్ ఇక్కడే: యూఎన్ రిపోర్ట్లో 139మంది పాక్ ఉగ్రవాదులు
ఇస్లామాబాద్: మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లోనే తలదాచుకున్నాడని ఐక్యరాజ్యసమితి కూడా తేల్చింది. తాజాగా ఐక్యరాజ్యసమితి జాతీయ భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) రూపొందించిన ఉగ్రవాద జాబితాలో దావూద్ తోపాటు ఎక్కువ మంది పాకిస్థానీయులే ఉండటం గమనార్హం
ఈ జాబితాలో పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన 139 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు డాన్ పత్రిక వెల్లడించింది. పాక్లో ఉండే వీళ్లంతా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు యూఎన్ తెలిపింది. ఈ జాబితాలో మోస్ట్ వాంటెడ్ అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, 26/11 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ ఉన్నారు.
పాక్లోని రావల్పిండి, కరాచీ నుంచి దావూద్ పాస్పోర్టులు పొందినట్లు యూఎన్ పేర్కొంది. కరాచీలోని నూరాబాద్లో దావూద్కు ఓ ఖరీదైన బంగ్లా ఉన్నట్లు డాన్ తన కథనంలో రాసుకొచ్చింది. లష్కరే తొయిబా(ఎల్ఈటీ), జమాత్ ఉల్ దవా సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఎక్కువ మంది ఈ జాబితాలో ఉన్నారు.
తమ దేశం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతోందని పాక్ చెబుతున్నప్పటికీ.. యూఎన్ విడుదల చేసిన ఈ జాబితాలో ఎక్కువ మంది పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులు ఉండటంతో, ఆ ప్రాంతంలో ఉగ్రవాద ప్రాబల్యం అధికంగానే ఉందనే విషయం స్పష్టమవుతోంది.