ఐసిస్ ఉగ్రవాదుల అడ్డా: లక్ష బాల్ బేరింగులతో బాంబుల తయారీ: తాజా పేలుళ్లు
కొలంబో: శ్రీలంకలో తాజాగా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఒకే ప్రాంతంలో మూడు శక్తిమంతమైన బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్ల వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాల గురించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. శ్రీలంకలోని కల్మునై నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజధాని కొలంబో నుంచి సుమారు 360 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ నగరం. శ్రీలంక తూర్పు తీర ప్రాంతంలో ప్రధాన నగరం. శుక్రవారం రాత్రి పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలు సంయుక్తంగా తనిఖీ నిర్వహిస్తుండగా.. ఈ పేలుళ్లు సంభవించాయి,
భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ సానుభూతిపరులు పెద్ద సంఖ్యల తిష్ట వేసినట్టు పక్కాగా సమాచారం అందడంతో కల్మనై సిటీలో పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు. నగర శివార్లలోని ఓ పారిశ్రామికవాడపై దాడి చేశారు. ఈ సందర్భంగా- గోడౌన్ లో దాచి ఉంచిన మూడు శక్తిమంతమైన బాంబులు వెంటవెంటనే పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయాయి. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించినట్లు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.
మరిన్ని పేలుళ్లకు కుట్ర..
కల్మునై సిటీ సమీపంలోని సమ్మన్ థునైలో పోలీసులు ఒకే ప్రాంతం నుంచి ఏకంగా లక్ష బాల్ బేరింగులు, 150 జిలెటిన్ స్టిక్స్ లను స్వాధీనం చేసుకున్నారు. బాంబు పేలుళ్ల కోసం దీన్ని వినియోగిస్తారని పోలీసులు తెలిపారు. లక్ష బాల్ బేరింగులతో కనీసం 25 శక్తిమంతమైన బాంబులను తయారు చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. జిలెటిన్ స్టిక్స్, బాల్ బేరింగులను బాంబుల తయారీ కోసమే సమకూర్చుకుని ఉంటారని చెబుతున్నారు. అవన్నీ తయారై ఉంటే- శ్రీలంకలో నరమేథం యథేచ్ఛగా కొనసాగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితోపాటు- పెద్ద ఎత్తున ఐసిస్ ఉగ్రవాదుల యూనిఫాం, జెండాలను స్వాధీనం చేసుకున్నారు
ఈస్టర్ సండే నాడు ఆత్మాహూతి దళాల దాడులతో ఆరంభమైన పేలుళ్ల పర్వ అయిదురోజులైనప్పటికీ.. ఇంకా కొనసాగుతుండటంతో శ్రీలంక దేశవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఉగ్రవాదులు మళ్లీ, మళ్లీ విరుచుకుని పడే అవకాశం ఉందంటూ అమెరికా ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో.. శ్రీలంక ప్రభుత్వం గట్టి నిఘా చర్యలు చేపట్టింది. మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. దీనికి అనుగుణంగా ఆ దేశంలో బాంబులు తయారు అవుతున్నాయి. కొన్ని మారుమూల పట్టణాల్లో యథేచ్ఛగా బాంబులను తయారు చేస్తున్నారు. శ్రీలంకకే చెందిన ఐసిస్ సానుభూతిపరులై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈస్టర్ సండే నాటి ఘటన అనంతరం పోలీసులు సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పక్కా సమాచారాన్ని సేకరిస్తున్నారు.