సిద్ధూ కౌగిలించుకున్న కొద్ది రోజులకే: భారత్పై పాక్ ఆర్మీ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
కరాచి: భారత దేశానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వా హెచ్చరికలు జారీ చేశారు. తమ సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని వ్యాఖ్యానించారు. జమ్ము కాశ్మీర్ ప్రజలకు వందనాలు అని వ్యాఖ్యానించారు.
ఓ వైపు భారతదేశంతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. అలా చెబుతూనే, ఆ తర్వాత కాశ్మీర్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్ధూ.. ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను కౌగిలించుకున్నారు. దీనిపై విమర్శలు వచ్చాయి. అయితే ఆయన కౌగిలించుకున్న కొద్ది రోజులకే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భారత్ పైన అక్కసు వెళ్లగక్కారు.
భారత్లో ఉన్న కాశ్మీర్కు విముక్తి కలిగిస్తామని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అన్నారు. పాకిస్తాన్ రక్షణ రంగం వెబ్ సైట్ కథనం ప్రకారం.. కాశ్మీర్ ప్రజలు ఎంతో ధైర్య సాహసాలతో పోరాడుతున్నారని, వారికి విముక్తి కలిగించేందుకు మా వంతు సహకారం చేస్తామని, కాశ్మీర్లోని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల త్యాగాలకు సలాం చేస్తున్నామని పేర్కొన్నారు.
సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన మా సైనికుల మృతికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని వ్యాఖ్యానించారు. ఆయన 53వ డిఫెన్స్ డే సందర్భంగా రావల్ఫిండిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.
సిద్ధూ నో కామెంట్
పాకిస్తాన్ వెళ్లి తాను ఏ ఆర్మీ చీఫ్ను అయితే కౌగిలించుకున్నాడో అదే ఆర్మీ చీఫ్ భారత్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం పట్ల నవజ్యోత్ సింగ్ సిద్ధూను ప్రశ్నిస్తే... నో కామెంట్ అన్నారు. చర్చల ద్వారానే ముందుకు వెళ్లాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. శాంతి మాత్రమే మార్గమన్నారు.