చైనాలో అద్భుతం: మరణించి మళ్లీ బతికిన శిశువు
బీజింగ్: చైనాలో ఓ అద్భుతం జరిగింది. ఓ మగ శిశువు పుట్టిన కొన్ని రోజులకే చనిపోయాడు. వైద్యులు కూడా చనిపోయాడని ధ్రువీకరించారు. అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధం కాగా ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు కళ్లు తెరిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ అద్భుతమైన సంఘటన చైనాలోని షింజియాంగ్ రాష్ట్రంలో చోటుచేసుకుందని స్థానిక వార్తా ఛానెల్ పేర్కొంది. జనవరి నెలలో నెలలు నిండకుండా పుట్టిన మగ శిశువును వైద్యులు 23 రోజులు పాటు ఇంక్యుబేటర్లో ఉంచారు. చైనా నూతన సంవత్సరం లూనార్ కొత్త ఏడాది వేడుకలను జరుపుకునేందుకు తండ్రి గత వారం శిశువును ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చాడు.
అయితే కొన్ని రోజులకే చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో గురువారం మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స్ పొందుతూ ఫిబ్రవరి 4న శిశువు గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో మైనస్ 12 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న శవపేటికలో పెట్టి శిశువు మృతదేహాన్ని పెట్టి గురువారం రాత్రంతా మార్చురీలో ఉంచారు.
శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు బయటకు తీసి శ్మశానానికి తీసుకెళ్లారు. చివరి క్షణంలో శిశువు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించిన కాటికాపరి ఆ విషయాన్ని తండ్రికి తెలిపారు. అంతలోనే బాలుడు కళ్లు తెరచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
చిన్నారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు. అయితే ఆ శిశువు మైనస్ 12 డిగ్రీల శీతలీకరణ శవ పేటికలో 15 గంటలపాటు ఎలా బతికాడన్నది విచిత్రంగా ఉంది. అయితే శవపేటికలో ఉంచే ముందు చిన్నారి తండ్రి రెండు పొరల మందమైన బట్టతో కప్పి ఓ బ్యాగులో ఉంచడమే కారణమని అంటున్నారు.