టర్కీలో బాంబు పేలుడు: 28మంది మృతి(వీడియో)
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 28మంది మృతి చెందగా.. 61మంది గాయాలపాలయ్యారు. టర్కీ మిలటరీ అధికారులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.
ఆ దేశ పార్లమెంట్తో పాటు సైనిక అధికార కార్యాలయ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. అంకార పేలుడును ఉప ప్రధాని బేకిర్ బోజ్డాగ్ ఉగ్రచర్యగా అభివర్ణించారు. పేలుడు జరిగిన స్థలంలో ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. పేలుడు శబ్ధం సిటీ మొత్తం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.
పేలుడు వల్ల మృతిచెందిన వారిలో సాధారణ పౌరులు ఉన్నారు. ఈ ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థా ఇప్పటివరకు బాధ్యత ప్రకటించలేదు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి అంబులెన్స్లు, ఫైర్ ఇంజిన్లను చేరుకున్నాయి.
ఉగ్రదాడులను అడ్డుకునేందుకు తాము మరింత దృఢ చిత్తంతో ఉన్నామని ఆ దేశాధ్యక్షుడు రిసీప్ తయ్యిప్ ఎర్డగోన్ అన్నారు. పేలుడు దాడిని అమెరికా ఖండించింది. మృతులకు నివాళి ప్రకటించింది.
దాడికి పాల్పడింది ఎవరనేది ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని టర్కీ ఉప ప్రధాని నుమాన్ కుర్టుల్మస్ తెలిపారు. సైనికులు మిలటరీ వాహనాల్లో వెళ్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించిందని చెప్పారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించామని అధికారులు తెలిపారు.