Texas: హిమపాతం బీభత్సం-నో పవర్- నో వాటర్: ఇబ్బంది పడుతున్న తెలుగు వారు: ఫోటోలు చూస్తే వణుకు
టెక్సాస్ : అమెరికా దేశాన్ని మంచు కప్పేసింది. అక్కడ చల్లటి వాతావరణానికి ప్రజలు భయపడిపోతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం , ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించకపోవడంతో అమెరికా దేశస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ చలికాలం నడుస్తున్న నేపథ్యంలో ఎటు చూసినా మంచు కనిపిస్తోంది. ప్రధాన రహదారులతో పాటు నివాసాల్లో కూడా వస్తువులు మంచుతో గడ్డకట్టుకుని ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా మంచు కప్పేయడంతో విద్యుత్ సరఫరాకు బ్రేక్ పడింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినప్పటికీ... అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఇంకా ఇబ్బందుల నుంచి పూర్తిగా తేరుకోలేదు.
టెక్సాస్లో పవర్ వాటర్ సప్లయ్ కట్
అమెరికాలో 3.4 మిలియన్ వినియోగదారులు విద్యుత్ లేకుండానే కాలం వెల్లదీస్తున్నారు. అదే సమయంలో నీటి సరఫరా కూడా నిలిచిపోవడంతో పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నీళ్లు పైపులోనే గడ్డకట్టడంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. కొందరని ప్రభుత్వం షెల్టర్ హోమ్స్కు తరలించింది. నీటి సరఫరా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు టెక్సాస్ నివాసి తెలుగు వ్యక్తి సాప్ట్వేర్ ఇంజినీర్ అయిన మల్లెల నరేష్ వన్ ఇండియాతో చెప్పారు. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతుండటంతో కొలాయి నుంచి వచ్చే నీటిని వేడి చేసుకుని తాగాలని అధికారులు టెక్సాస్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. మంచు గడ్డ కట్టుకుపోవడంతో పైపులు డ్యామేజ్ అయినట్లు వారు తెలిపారు.
ఇంట్లో వస్తువులపై మంచు ప్రభావం
బుధవారం మధ్యాహ్నం నుంచి టెక్సాస్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో అమెరికా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన టెక్సాస్ అంధకారంలోకి పోయింది. అక్కడ దాదాపు 3 మిలియన్ గృహాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక టెక్సాస్ ప్రజలు కొందరు తమ నివాసంలో గడ్డకట్టుకుపోయిన వస్తువులను ఫోటోలు తీసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ ఫోటోలు చూసిన నెటిజెన్లు ఒక్కింత ఆశ్చర్యానికి గురికావడంతో పాటు షాక్కు కూడా గురయ్యారు. ఇక అమెరికాలో స్థిరపడ్డ తమవారు ఎలా ఉన్నారో అని భారత్లోని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కమోడ్స్లో ఐస్ గడ్డలు, ఆయిల్ బాటిల్ కూడా..
పలు గృహాల్లోని సీలింగ్ ఫ్యాన్లు మంచు ప్రభావంతో గడ్డకట్టుకుపోయాయి. మరికొన్ని గృహాలను పూర్తిగా మంచు కప్పేసింది. ఇక వాష్రూంలలో కూడా కమోడ్స్ గడ్డకట్టుకుపోయిన ఫోటోలను టెక్సాస్ ప్రజలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక కుళ్లాయి నుంచి నీరు గడ్డ కట్టుకుని వస్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి.ఇక ఆలివ్ ఆయిల్ బాటిల్ కూడా గడ్డ కట్టుకుపోయిందని సీన్ హైటవర్ అనే వ్యక్తి ఫోటోను పోస్టు చేశాడు. గత 38 గంటలుగా అలానే ఉందని పోస్టులో రాసుకొచ్చాడు.
ఇప్పటి వరకు 30 మంది మృతి
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు టెక్సాస్లో విపరీతమైన మంచు కురుస్తుండగా.. ప్రస్తుతం అది ఈశాన్యం వైపు కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ ప్రాంతంలో దాదాపు 100 మిలియన్ జనాభా నివసిస్తోందని అధికారులు తెలిపారు. ఇక ఈ వారం వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో 30 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కొందరు ఇళ్లలోనే ఉంటూ మృతి చెందినట్లు చెప్పారు. హూస్టన్ ప్రాంతంలో గ్యారేజీలో ఉంచిన కారు నుంచి కార్బన్ మొనాక్సైడ్ విడుదల కావడంతో ఇంట్లోనే ఓ కుటుంబం మృతి చెందిన విషయం కలకలం సృష్టించింది. చలి నుంచి తట్టుకునేందుకు మంట పెట్టడంతో నిప్పు అంటుకుని మరొక కుటుంబంలోని సభ్యులు మృతి చెందారు. ఒరెగాన్ లాంటి ప్రాంతంలో గత వారం రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.