లెక్కల్లో పొరపాటు: మృతుల సంఖ్యను భారీగా తగ్గించిన లంక సర్కార్
కొలంబో: ఆస్టర్ సండే నాడు శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు సృష్టించిన మారణకాండలో హతమైన వారి సంఖ్య భారీగా తగ్గింది. ఆత్మాహూతి దాడుల్లో మరణించిన వారి సంఖ్య 359గా ఇదివరకు నిర్ధారించిన శ్రీలంక ప్రభుత్వం.. తాజాగా దాన్ని సవరించింది. ఈ పేలుళ్లలో 253 మంది మృత్యువాత పడినట్లు ప్రకటించింది. ఇకపై మీడియా సంస్థలు మృతుల సంఖ్యను 253గా పరిగణించాలని అధికారులు సూచించారు.
శక్తిమంతమైన బాంబు పేలుళ్ల వల్ల మృతదేహాలు ఛిద్రమయ్యాయని, శరీర విడిభాగాలను లెక్కించి, మృతుల సంఖ్యను 359గా ఇదివరకు నిర్ధారించామని శ్రీలంక వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. తాము ప్రకటించిన సంఖ్యకు అనుగుణంగా- బాధిత కుటుంబాలు లేవని చెప్పారు. మృతదేహాల లెక్కింపులో పొరపాట్లు దొర్లాయని అన్నారు. దీనితో మృతుల సంఖ్యను సవరించాల్సి వచ్చిందని అన్నారు.
ఉగ్రదాడులపై అవసరమైతే ఆదేశ సహకారం కోరుతాం: రణిల్ విక్రమసింఘే
మృతుల్లో 11 మంది భారతీయులు..
ఆత్మాహూది దాడుల్లో మృతి చెందిన 253 మందిలో విదేశీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారని రక్షణ శాఖ వెల్లడించింది. మొత్తం 40 మంది విదేశీయులు దుర్మరణం పాలుకాగా, వారిలో 11 భారతీయులు ఉన్నట్లు తేలిందని చెప్పారు. జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి చెందిన ఎనిమింది మంది నాయకులు ఈ పేలుళ్లలో మరణించినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నలుగురు హతమైనట్లు ఇదివరకే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. మిగిలిన వారి జాడ ఇంకా తెలియరాలేదు.
భారీగా అరెస్టులు..
శ్రీలంక భద్రతా బలగాలు, పోలీసులు భారీ సంఖ్యలో అనుమానితులను అరెస్టు చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న అనుమానితుల సంఖ్య వంద దాటింది. తాజాగా మరో 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురి నుంచి 21 గ్రెనేడ్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే- విసా గడువు ముగిసినా దేశంలోనే మకాం వేసిన విదేశీయులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు ఈజిప్షియన్లు ఉన్నారని, విసా గడువు ముగిసినప్పటికీ, దేశంలోనే తలదాచుకుంటున్నారని చెప్పారు. మరికొందరి వద్ద కాలం తీరిన పాస్ పోర్టులు ఉన్నాయని అన్నారు. ఇదిలావుండగా- భారీ ఎత్తున ఆత్మాహుతి దాడులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినప్పటికీ.. నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారనే విమర్శలు శ్రీలంక ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో- శ్రీలంక రక్షణ మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజీనామా చేశారు.