Coronavirus: చైనాలో 2000 మందిని బలి తీసుకున్న వైరస్: 75 వేల మందిలో పాజిటివ్: పిట్టల్లా..!
బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్ మరింత భయానకంగా మారింది. తన పదుల సంఖ్యలో జనాన్ని బలి తీసుకుంటోంది. చైనాలో మొట్టమొదట ఈ కేసు వెలుగులోకి వచ్చిన ఈ రెండునెలల వ్యవధిలో 2000 మందిని పొట్టన పెట్టుకందా మహమ్మారి. దీని విజృంభణకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించట్లేదు. 75 వేల మందిలో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు నమోదయ్యాయి. వారంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
హ్యుబె ప్రావిన్స్లో ఒక్కరోజే 132 మంది..
వుహాన్ సిటీ సహా హ్యుబే ప్రావిన్స్లోని వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం ఒక్కరోజే 132 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ 24 గంటల వ్యవధిలోనే కొత్తగా 1693 మందిలో కొత్తగా వైరస్ లక్షణాలు కనిపించాయి. వారందర్ని ప్రత్యేక వైద్య శిబిరాలు, ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో 13 వేల మంది ఆరోగ్యం కాస్త మెరుగుపడటం ఊరట కలిగిస్తోందని హ్యుబె ప్రావిన్స్ మెడికల్ కమిషన్ అధికారులు వెల్లడించారు.
ఎస్ఏఆర్సీ వైరస్ కంటే..
చైనాలోనే జన్మించిన సార్స్ (ఎస్ఏఆర్సీ) వైరస్ సృష్టించిన బీభత్స కంటే కూడా కరోనా సృష్టించిన కల్లోలం మరింత భయానకంగా మారింది. ఇదివరకు సీవర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) బారిన పడి చైనా 774 మంది మరణించారు. దాన్ని ఎప్పుడో దాటేసింది కరోనా విలయ తాండవం వల్ల మరణించిన వారి సంఖ్య. ఒక్క రోజే 132 మంది మరణించడాన్ని బట్టి చూస్తోంటే.. ఇప్పట్లో దీనికి అడ్డుకట్ట పడేలా కనిపించట్లేదని చెబుతున్నారు.
Recommended Video
ఆసుపత్రులు, వైద్య శిబిరాలు కిటకిట
రోజురోజుకు వందలాది మందిలో కొత్తగా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకున్నారు చైనా వైద్యాధికారులు. ఇప్పటికే చైనాలోని ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. కిటకిటలాడుతున్నాయి. కొత్తగా వందలాది మందిలో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వారి కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినప్పటికీ.. అవి ఏమాత్రం చాలట్లేదు. ఫలితంగా- చాలామంది తమ నివాసాల్లోనే చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఇలా ఇళ్లల్లో ఉంటూ చికిత్స తీసుకున్న వారి సంఖ్యే అధికంగా ఉందని తెలుస్తోంది.