ఆకాశంలో అద్భుతం: మరోసారి త్రిభుజ ఆకారంలో కనువిందు చేసిన చంద్రుడు-శని-గురు గ్రహాలు
ఆకాశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని రోజుల క్రితం చందమామ భూమికి అత్యంత దగ్గరగా వచ్చింది. అంతేకాదు బ్లూ మూన్ కూడా ఆకాశంలో దర్శనం ఇచ్చింది. ఇక ఉల్కల సంగతి చెప్పక్కర్లేదు. ఇలాంటి అద్భుతాల్లో బుధవారం రాత్రి మరొకటి కనువిందు చేసింది. నవంబర్ 20వ తేదీన చంద్రుడు-శని-గురు గ్రహాలు త్రిభుజ ఆకారంలో కనిపించి కనువిందు చేసిన కొద్దిరోజులకే మళ్లీ డిసెంబర్ 16 బుధవారం రోజున మళ్లీ అలానే కనిపించి చూపరులను ఆకట్టుకున్నాయి.చంద్రుడు, శని గ్రహం (saturn) గురు గ్రహం (Jupiter) ఈ మూడు త్రిభుజం ఆకారంలో కనిపించి కనువిందు చేశాయి. చీకటి పడగానే ముందుగా నెలవంక చంద్రుడు కనిపించింది. ఆ తర్వాత క్రమంగా రెండు గ్రహాలు కనిపించాయి. ఇలా దాదాపు రెండు గంటల పాటు ఈ అద్భుతమైన దృశ్యం వినీలాకాశంలో కనిపించింది.
ఇక ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు కొందరు చిన్న సైజు టెలిస్కోపులు వినియోగించారు. టెలిస్కోపుతో వీక్షించడం వల్ల గురు గ్రహంపై క్రేటర్స్ , ఆ గ్రహంపై ఉన్న చంద్రుడు కనిపించినట్లు కొందరు చెబుతున్నారు. ఇక శని గ్రహం చుట్టూ ఉన్న రింగ్స్ కూడా టెలిస్కోప్ ద్వారా కనిపించినట్లు ఈ అద్భుత దృశ్యాన్ని చూసినవారు చెబుతున్నారు. డిసెంబర్ 16న చంద్రుడు-శని గ్రహం- గురు గ్రహం మళ్లీ త్రిభుజం ఆకారంలో కనువిందు చేస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు ముందే చెప్పడంతో నవంబర్ 20వ తేదీన ఈ సుందర దృశ్యాన్ని చూడటం మిస్ అయిన వారు.. బుధవారం రాత్రి చూసి చాలా సంబరపడ్డారు.
Recommended Video
డిసెంబర్ 21వ తేదీన గ్రేట్ కంజంక్షన్ ఏర్పడుతుందని అంతకంటే ఐదు రోజుల ముందు చంద్రుడు, శని, గురు గ్రహాలు త్రిభుజం ఆకారంలో కనిపించి కనువిందు చేస్తాయని శాస్త్రవేత్తలు ముందుగానే చెప్పారు. చంద్రుడు లేదా మరొక గ్రహం ఇంకో ఖగోళ వస్తువుకు సంబంధించి రేఖాంశాన్ని కలిగి ఉంటే దాన్ని సంయోగం (conjunction)గా పిలుస్తామని శాస్త్రవేత్తలు వివరించారు. ఇక ప్రతి 19.6 ఏళ్లకు ఒకసారి గురు గ్రహం శని గ్రహంను దాటుకుంటూ వెళుతుంది. అయితే డిసెంబర్ 21న మాత్రం ఈ రెండు అత్యంత సమీపంలోకి వస్తాయని... 1623వ సంవత్సరం తర్వాత మళ్లీ అంత దగ్గరగా ఈ రెండు గ్రహాలు వస్తుండటం ఇదే తొలిసారని సైంటిస్టులు తెలిపారు.