ప్రపంచ హిందూ మహాసభలు: అతిథులకు మెత్తటి లడ్డు..గట్టి లడ్డు ఎందుకిచ్చారో తెలుసా...?
చికాగో: ప్రపంచ హిందూ కాంగ్రెస్ మహాసభలు చికాగో జరుగుతున్నాయి. అయితే అక్కడ ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అక్కడికి వచ్చిన అతిథులకు ఒక స్వీట్ బాక్స్ అందజేశారు. అందులో రెండు లడ్లు ఉన్నాయి. ఒక లడ్డు చాలా మెత్తగా ఉండగా మరో లడ్డు చాలా గట్టిగా ఉంది. ఈ రెండు లడ్లకు ఒక చిన్న కథ కూడా చెప్పారు. ఈ రెండు లడ్లులా హిందూ సమాజం ఒక్కటిగా లేదని నిర్వాహకులు తెలిపారు.
నేటి హిందూ సమాజం చాలా సుతిమెత్తగా ఉందని దాన్ని చీల్చడం చాలా సులభమని అదే మెత్తని లడ్డు సూచిస్తుందని చెప్పిన నిర్వాహుకులు... భవిష్యత్తులో హిందూ సమాజం గట్టి లడ్డూల ఉండాలని హిందూ కార్యనిర్వాహకులు కోఆర్డినేటర్ గణేషన్ గున మగేసన్ తెలిపారు. హిందువులంతా కలిసిగట్టుగా ఉంటేనే తమ హక్కులను సాధిచుకోగలుగుతామని స్వామి పూర్ణాత్మానంద అన్నారు. హిందూ మతబోధనలు మానవత్వం కోసమే అన్న స్వామీజీ... ప్రతి స్కూలు, కాలేజీలో హిందూ మతబోధనలు చేయాలని ఆయన కోరారు.
ఒక కుటుంబం కూలితే... సంస్కృతి కూలుతుందని... దాంతో జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోలేమని చిన్మయ మిషన్ ఆత్మీయగురు అన్నారు. అందుకే హిందువులు ఇతర మతాలకు మారకుండా... మారిన వారిని తిరిగి హిందూమతం స్వీకరించేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
భారత్లోని విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని చిన్మయ మిషన్ ఆత్మీయగురువు అన్నారు.పాఠ్య పుస్తకాలలో హిందూ మతంకు సంబంధించిన సంస్కృతిని చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాచీన కాలంలో గురుకులాల్లో రుషులు శిష్యులకు ఎలాగైతే బోధించారో అలానే బోధించాలని తెలిపారు. భగవంతుడు విశ్వాన్ని మనిషి కోసం సృష్టించలేదని... ప్రకృతిని హిందువులు కాపాడాలనే బాధ్యతను అప్పజెప్పడని ఆయన అన్నారు.
అంతేకాదు దేశాన్ని ఇండియా అని సంబోధించడం మానేసి భారత్ అని పిలవాలని సద్గురు దలీప్ సింగ్ అన్నారు. హిందువులు సిక్కులు ఇద్దరూ వేరుకారని... సిక్కులు హిందువుల్లానే ఉండాలని గురుగ్రంథ్ సాహెబ్ చెబుతోందన్నారు. చికాగోలో స్వామి వివేకానంద ప్రసంగించి 125 ఏళ్లు పూర్తవుతున్నందున అక్కడ ప్రపంచ హిందూ కాంగ్రెస్ సభలు జరుగుతున్నాయి.