డెలాయిట్పై భారీ సైబర్ దాడి! హ్యాకర్ల చేతికి సీక్రెట్ మెయిల్స్!?
ప్రముఖ అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ పై భారీ సైబర్ దాడి జరిగింది. సంస్థ అందించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది మార్చిలోనే ఈ సైబర్ ఎటాక్ జరిగింది.
వాషింగ్టన్: ప్రముఖ అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ పై భారీ సైబర్ దాడి జరిగింది. సంస్థ అందించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది మార్చిలోనే ఈ సైబర్ ఎటాక్ జరిగింది. క్లయింట్లకు చెందిన విలువైన సమాచారం, రహస్య మెయిల్స్ హ్యాకర్ల బారిన పడ్డాయి.
దీనిపై పూర్తిగా విచారణ ప్రారంభించామని డెలాయిట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. చాలా కొద్ది మంది ఖాతాదారులను మాత్రమే ఈ దాడి ప్రభావితం చేసిందనీ, ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించామని తెలిపింది.
క్లయింట్ బిజినెస్ వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేదనీ, పూర్తి విచారణ జరిపిస్తున్నామని ప్రకటించింది. అలాగే తమ సైబర్-సెక్యూరిటీ వ్యవస్థ చాలా ఉత్తమమైందనీ , ఖాతాదారుల రహస్య సమాచారాన్ని రక్షించడంలోనూ, వారి సైబర్ సెక్యూరిటీ భద్రత విషయంలో తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని సంస్థ పేర్కొంది.
అయితే చాలా పెద్ద సంఖ్యలో ఖాతాదారుల నుండి సమాచారం లీక్ అయిందనీ ది గార్డియన్ దినపత్రిక సోమవారం నివేదించింది. ఇందులో పెద్ద సంస్థలు, అమెరికా ప్రభుత్వ విభాగాలు కూడా ఉన్నాయని తెలిపింది.
మరోవైపు అమెరికాలోనే అతి పెద్ద ప్రైవేట్ సంస్థ డెలాయిట్ డేటాపై గత ఏడాది అక్టోబర్ నుంచి మార్చి వరకూ హ్యాకర్లు కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలోనే భారీ సైబర్ దాడికి గురైందట.