ప్రజాస్వామ్య విజయం, అమెరికన్లందరికీ అధ్యక్షుడిని: జో బైడెన్ ప్రసంగం, ట్రంప్కి చురక
వాషింగ్టన్: తాను అమెరికన్లందరికీ అధ్యక్షుడినని నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ స్పష్టం చేశారు. అమెరికాను ఉన్నస్థానంలో నిలిపేందుకు కృసి చేస్తానని అన్నారు. ఇందుకు ప్రజలందరి సహకారం కావాలని జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఇటీవల పార్లమెంటు భవనంపై జరిగిన దాడి పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యం గెలిచిందంటూ బైడెన్..
ఈ రోజు ప్రజాస్వామ్యం గెలిచిందంటూ పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్ పాలన అంతమైందని మాజీ అధ్యక్షుడికి చురకలంటించారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణం చేసిన అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. అమెరికాలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని, ఎన్నో సవాళ్లను అధిగమించిందని అన్నారు.
పార్లమెంటు భవనంపై దాడి దురదృష్టకరం
ప్రజాస్వామ్యం అత్యంత విలువైందని అమెరికా విశ్వసిస్తుందని, ఇలాంటి అమెరికా పార్లమెంటు భవనంపై దాడి జరగడం దురదృష్టకరమని బైడెన్ వ్యాఖ్యానించారు. ఇటీవల ట్రంప్ మద్దతుదారులు పార్లమెంటు భవనంపై దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా, అమెరికాను అన్ని విధాలా మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని బైడెన్ చెప్పారు.
అమెరికన్లంతా ఐక్యంగా ముందుకు సాగాలి..
దేశీయ ఉగ్రవాదంపై తప్పనిసరిగా విజయం సాధిస్తామని, శ్వేత వర్ణ అహంకారాన్ని తప్పకుండా ఓడిస్తామని చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా లక్షల్లో ఉద్యోగాలు పోయాయని, ఆర్థిక రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కష్టకాలంలో మన శక్తియుక్తులన్నీ చేసుకుని ముందు సాగాల్సిన సమయం ఆసన్నమైందని జో బైడెన్ స్పష్టం చేశారు. అమెరికన్లంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
చరిత్రాత్మక ఘటన.. కమలా హారీస్ గర్వకారణం..
కరోనా సంక్షోభ సమయంలో తన ప్రమాణం చరిత్రాత్మక ఘటన అని, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారీస్ ప్రమాణం చేయడం అమెరికాకే గర్వకారణమని బైడెన్ వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్క అమెరికన్ కూడా చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటానని మరోసారి స్పష్టం చేశారు. బుధవారం అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయగా, ఉపాధ్యక్షురాలిగా భారతీయ అమెరికన్ కమలా హ్యారీస్ ప్రమాణ స్వీకారం చేశారు. కమలనే తొలి మహిళా ఉపాధ్యక్షురాలు కావడం విశేషం. తాను సేవ చేసేందుకు సిద్ధమయ్యానంటూ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కమలా హారీస్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.