వెనిజులాలో పెద్ద నోట్లు రద్దు: అత్యవసర ప్రకటన చేసిన అధ్యక్షుడు
వెనిజులాలో పెద్ద నోటుగా చలామణి అవుతున్న 100బొలివర్ నోటును రద్దు చేస్తున్నట్టు అధ్యక్షుడు నికోలస్ మదురో అత్యవసర ప్రకటన జారీ చేశారు.
కారకాస్: భారత ప్రధాని నరేంద్ర మోడీ తరహాలోనే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కూడా పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పెద్ద నోటైన 100బొలివర్ ను నోటును రద్దు చేస్తున్నట్టు అత్యవసర ప్రకటన జారీ చేశారు. మాఫియా చేతుల్లో పోగబడిపోయిన కరెన్సీని నిలువరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు.
ముఖ్యంగా కొలంబియాలోని కొన్ని మాఫియా వర్గాలు 100బొలివర్ నోట్లను భారీ మొత్తంలో దాచిపెట్టడం.. ఈ పరిస్థితి దేశ ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుండటంతో.. నోట్లను రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ద్రవ్యోల్బణం ఉన్న దేశంగా వెనిజులా ఉంది.
రద్దు చేసిన నోట్ల స్థానంలో.. వాటికి 200 రెట్లు ఎక్కువ విలువ కలిగిన కొత్త నోట్లను, నాణేలను తీసుకొచ్చేందుకు వెనిజులా ప్రయత్నిస్తోంది. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్లో 100బొలివర్ నోటుకు మూడు సెంట్ల కన్నా తక్కువ విలువ ఉంది. ఒక హాంబర్గర్ కొనడం కోసం 100బొలివర్ నోట్లను యాభై వరకు చెల్లించాల్సి వస్తుందంటే.. దాని విలువ ఎంతగా పతనమైందో అర్థం చేసుకోవచ్చు.
కాంటాక్ట్ విత్ మదురో అనే తన టీవీ షో ద్వారా ఈ విషయాన్ని ప్రకటించిన మదరో.. మరో 72గం. పాటు మాత్రమే రద్దయిన నోట్లు చలామణిలో ఉంటాయని ప్రకటించారు. కాగా, అధ్యక్షుడి నిర్ణయంపై రిజర్వ్ బ్యాంకు పెదవి విరిచింది. ఇంత తక్కువ సమయంలో నోట్లను రద్దు చేయడం సరికాదని, రిజర్వ్ బ్యాంక్ కు పెద్ద నోట్లను ముద్రించడానికి తగినంత సమయం ఇచ్చి ఉండాల్సిందని వెనిజులా రిజర్వ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ ప్రస్తుత విపక్ష సభ్యుడు జోస్ గువెరా అభిప్రాయపడ్డారు.