కిమ్ మాట తప్పాడా..? ఉత్తరకొరియాలో కొనసాగుతున్న అణుకార్యక్రమం
అమెరికా ఉత్తరకొరియా దేశాల మధ్య చారిత్రాత్మక చర్చలు సందర్భంగా తమ దేశంలో అణ్వాయుధాల తయారీ కేంద్రాలను అణ్వాయుధాలను ధ్వంసం చేస్తామని కిమ్ జాంగ్ ఉన్ హామీ ఇచ్చారు. అయితే వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది . ఉత్తరకొరియాలోని యాంగ్బ్యాన్ న్లూక్లియర్ రియాక్టర్ వ్యవస్థను ఆధుణీకరిస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అణు రియాక్టర్ల ఆధుణీకరిస్తున్న దృశ్యాలను ఉపగ్రహం విడుదల చేసింది. అంతేకాదు యాంగ్ బ్యాన్ అణు కేంద్రంలో పనులు శరవేగంతో జరుగుతున్నట్లు శాటిలైట్ ఫోటోల ద్వారా తెలుస్తోంది.
ప్లుటోనియం ఉత్పత్తి చేస్తున్న రియాక్టర్లో శీతలీకరణ వ్యవస్థను ఆధునీకరించడం, కేంద్రం దగ్గర రెండు భవన నిర్మాణాలు చేపడుతున్న ఫోటోలు కూడా విడుదలయ్యాయి. ఇదిలా ఉంటే అణుకేంద్రాలను, ధ్వంసం చేస్తున్నట్లు కిమ్ ట్రంప్తో భేటీ సందర్బంగా హామీ ఇచ్చారు. అంతకుముందు కూడా ధ్వంసం చేస్తున్న వీడియోలను ప్రపంచానికి విడుదల చేశారు. అయితే అణు కేంద్రాలను ఎలా ఎప్పుడు ధ్వంసం చేస్తారనేదానిపై మాత్రం ట్రంప్తో సమావేశం సందర్భంగా ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉంటే అమెరికాను టార్గెట్ చేసేందుకు కావాల్సిన అణ్వాయుధాల తయారీని ఉత్తరకొరియా పూర్తి చేసిందంటూ ఈ ఏడిది మొదట్లో కిమ్ ప్రకటించారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచానికి తెలిసిన ఒకే ఒక అణ్వాయుధాల తయారీ కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు మే నెలలో చెప్పారు. కానీ అది మాత్రమే మూసివేసినట్లు తెలిపిన ఉత్తరకొరియా... యాంగ్బ్యాన్ అణుకేంద్రంలో మాత్రం పనులను కొనసాగిస్తూ వచ్చింది. ప్యాంగ్యాంగ్ నుంచి ప్లాంట్ను మూసివేయాల్సిందిగా అధికారిక ఆదేశాలు వచ్చే వరకు అక్కడ పనులు జరుగుతూనే ఉంటాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.