అందుకే పాక్ అలా చేసి ఉండొచ్చు: మసూద్ కొడుకు, సోదరుడి అరెస్టుపై భారత్ అనుమానం
ఇస్లామాబాద్: జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ తనయుడిని, సోదరుడిని పాకిస్తాన్ అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. వారిద్దరు సహా మొత్తం 44 మంది ఉగ్రవాదులను నిర్బంధించింది. పుల్వామా దాడి అనంతరం ఉగ్రవాదులకు అండగా నిలబడుతున్నారంటూ పాకిస్తాన్ పైన విమర్శలు వెల్లువెతుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్కు మద్దతు లభించింది. దీంతో పాక్ ఇరుకున పడింది.
దీంతో మసూద్ అజహర్ సోదరుడు అబ్దుల్ రవూఫ్, కొడుకు హమద్ హజార్లను పాక్ అరెస్టు చేసిందట. ఈ మేరకు పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్ట్రీ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ వార్తలపై భారత్ పెదవి విరిచింది. వారిద్దరిని అరెస్ట్ చేశామని చెప్పుకోవడం పాక్కు సిగ్గుచేటు అని భారత్ పేర్కొంది.
భద్రత కల్పించేందుకే అదుపులోకి తీసుకొని ఉండవచ్చు
ఉగ్రవాద నిరోధక చట్టాల కింద ఆయా ఉగ్రవాదులను అరెస్టు చేయలేదని, దర్యాప్తు కోసం ముందస్తు నిర్బంధంలోకి మాత్రమే తీసుకున్నారని భారత్ అధికారులు పేర్కొన్నారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇది ఆయా ఉగ్రవాదులకు భద్రత కల్పించేందుకు పాకిస్తాన్ సైన్యం చేస్తున్న ప్రయత్నం కూడా అయివుంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఓ ప్రహసనమేనని, గతంలోనూ మసూద్ అజహర్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్లను కూడా పలుమార్లు అదుపులోకి తీసుకుని వదిలేశారని గుర్తు చేశారు.
కాపాడేందుకే అరెస్టులు అని అనుమానం
మసూద్ అజహర్ సోదరుడు, కుమారుడిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు. పాకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాలను నియంత్రించాలని పాకిస్థాన్పై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో నిషేధిత ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ చేపట్టిన చర్యల్లో భాగంగా 44 మంది ఉగ్రవాదులను కస్టడీలోకి తీసుకున్నట్లు పాకిస్థాన్ అంతర్గత శాఖ మంత్రి షేర్యార్ ఖాన్ ఆఫ్రిది తెలిపారు. అయితే ఈ అరెస్టులు ఏవీ పాక్ చట్టాలకు అనుగుణంగా జరగలేదని, ముష్కరులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని భారత్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భారత్ ఇచ్చిన లిస్టులోని వారందరిపై చర్యలు చేపడుతున్నట్లు కాదు
పుల్వామా ఉగ్రదాడి, అనంతర పరిణామాల నేపథ్యంలో జైష్ ఎ మహ్మద్పై చర్యలు చేపట్టాల్సిందిగా భారత్ ఇటీవల పాకిస్థాన్కు ఓ వివరణ పత్రం ఇచ్చింది. అందులో రవూఫ్, హమ్మద్ల పేర్లు కూడా ఉన్నాయి. అయితే భారత్ ఇచ్చిన లిస్టులోని వారందరిపై చర్యలు చేపడుతున్నట్లు కాదని పాక్ మంత్రి చెప్పాడు. ఎలాంటి ఒత్తిళ్ల వల్ల ఈ చర్యలు చేపట్టలేదన్నాడు. పాక్ నేల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతి ఉండవద్దనేది తమ ప్రభుత్వ విధానమన్నారు. 2014లో పెషావర్లోని ఓ సైనిక పాఠశాలపై ఉగ్రదాడి అనంతరం రూపొందించిన జాతీయ కార్యాచరణ ప్రణాళిక మేరకే నిర్దేశిత సంస్థలన్నింటిపైనా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రెండు వారాల పాటు ఈ చర్యలు కొనసాగుతాయని, అరెస్ట్ చేసినవారిపై ఆధారాల మేరకు చర్యలుంటాయన్నారు.