దేవయాని ఇష్యూ: అమెరికా దిద్దుబాటు, సర్దుబాటు
వాషింగ్టన్/ న్యూఢిల్లీ: దౌత్యవేత్త దేవయాని కోబ్రాగాదే అరెస్టుపై భారత ప్రభుత్వం అనూహ్యంగా కఠిన వైఖరి అవలంబించడంతో అమెరికా దిమ్మ తిరిగినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు హైప్రొఫైల్ కేసులో చోటుచేసుకున్న తప్పుల సమీక్షకు సిద్ధమైంది. దానికితోడు, భారత్ తన డిమాండ్ విషయంలో ఎంతమాత్రం సడలింపు లేనివిధంగా వ్యవహరిస్తోంది. దేవయానికి సంకెళ్లువేసి, తనిఖీలు చేసిన సంఘటనపై అమెరికా క్షమాపణ చెప్పాలని పట్టుబడుతున్న భారత్, ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఈ బృందం సోమవారం కీలక సమావేశం జరపబోతోంది. అంతర్జాతీయ న్యాయనిపుణులతో కూడిన ఈ బృందం తీసుకోబోయే నిర్ణయం భారత్ భవిష్యత్తు కార్యాచరణకు పదును పెట్టే అవకాశం ఉంది. అమెరికా సమీక్షలో పాలు పంచుకుంటున్న విభాగాల్లో వైట్హౌస్కు చెందిన జాతీయ భద్రతా మండలి, విదేశాంగ శాఖ, న్యాయ శాఖ ఉన్నాయి. ‘కేసులో చోటుచేసుకున్న పొరపాట్లపై ఇప్పుడు వివిధశాఖల మధ్య సమీక్ష జరుగుతోంది' అని అధికార వర్గాలు పిటిఐకి తెలిపాయి.
కేసును నిర్వహించే విషయంలో నిర్ణయాలకు సంబంధించి కొన్ని తప్పులు జరిగాయని ఆ వర్గాలు పరోక్షంగా అంగీకరిస్తూ, విదేశాంగ శాఖ నేతృత్వంలో వివిధ శాఖలకు చెందిన బృందం ఒకటి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తోందని తెలిపాయి. ఇప్పుడు ఈ వ్యవహారం న్యాయస్థానానికి చేరినందున, పరిష్కారం చాలావరకు న్యాయమూర్తులపై కూడా ఆధారపడి ఉన్నందున న్యాయ శాఖ, న్యూయార్క్కు చెందిన సదరన్ డిస్ట్రిక్ట్ విభాగం కూడా ఈ వ్యవహారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నాయి.
ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించిన తీరుపట్ల రక్షణ మంత్రిత్వ శాఖ తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి రక్షణ కార్యాలయం (పెంటగాన్) తన విధానాన్ని పునస్సమీక్షించుకుంటున్న తరుణంలో, ఈ ప్రాంతంలో భారత్ కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నందున, అలాగే భారత్ పెద్దఎత్తున చేపట్టిన సాయుధ దళాల ఆధునీకరణ కార్యక్రమంలో భారీవాటానే దక్కించుకోవాలని అనుకుంటున్న తరుణంలో భారత్తో సంబంధాలను దెబ్బతీసే ఎలాంటి సంఘటనా జరగకూడదని పెంటగాన్ భావిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి.