దేవయానికి ఊరట: కోర్టులో అభియోగాల కొట్టివేత
వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయాని కోబ్రాగేడ్ పైన వీసా మోసం కేసులో అభియోగాలను అమెరికాలోని స్థానిక కోర్టు కొట్టేసింది. న్యూయార్క్లోని భారత కాన్సులేట్ అధికారిగా ఉన్న సమయంలో దేవయాని తన ఇంట్లో పని మనిషికి సంబంధించిన వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతేడాది డిసెంబర్ 12న కేసు నమోదైన విషయం తెలిసిందే.
అనంతరం జరిగిన పరిణామాల్లో ఆమెను అమెరికా తమ దేశం నుంచి బహష్కరించించింది. ఈ కేసులో దేవయానిపై జనవరిలో అభియోగాలను నమోదు చేశారు. అయితే, అదే నెల 8వ తేదీన దేవయానికి పూర్తి దౌత్యరక్షణను మంజూరు చేసినందున ఆమెపై కేసును కొట్టివేస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు.
అరెస్టు సమయంలో దౌత్య రక్షణ కలిగి ఉన్నందున ఆమెపై అభియోగాలను కొట్టివేయక తప్పడం లేదని న్యాయమూర్తి చెప్పారు. దేవయాని కోబ్రాగేడ్ పైన బుధవారం స్థానిక న్యూయార్క్ కోర్టు అభియోగాలను కొట్టివేసింది. ఈ కోర్టు తీర్పుతో దేవయానికి ఊరట లభించిందని చెప్పవచ్చు.
కాగా, గత ఏడాది దేవయాని ఉదంతం అమెరికా, భారత్ మధ్య వేడి రాజేసిన విషయం తెలిసిందే. పని మనిషి విషయంలో దేవయానిని అమెరికా పోలీసులు అరెస్టు చేసి, దుస్తులు విప్పించి చెక్ చేయడం వివాదానికి దారి తీసింది.