అమెరికా ఆదేశాలు: భారత్కు బయల్దేరిన దేవయాని
న్యూయార్క్/న్యూఢిల్లీ: భారత దౌత్యవేత్త దేవయాని కోబ్రాగాడె భారత దేశానికి బయల్దేరారని శుక్రవారం అమెరికాలో ఆమె తరపు న్యాయవాది తెలిపారు. కోబ్రాగాడె న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బదిలీ అయ్యారని ఆయన చెప్పారు. తన సహాయకురాలు సంగీతా రిచర్డ్స్ వీసాకు సంబంధించి అవకతవకల ఆరోపణలతో అమెరికా అధికారులు కోబ్రాగాడెను డిసెంబర్, 2013లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధికారులు ఆమెపై నిరాధారమైన, తప్పుడు అభియోగాలు మోపారని ఆయన తెలిపారు.
వీసా అవకతవకలకు పాల్పడిన ఆరోపణలతో కోబ్రాగాడెకు సంకెళ్లు వేసి, పూర్తిగా దుస్తులు విప్పి తనిఖీలు నిర్వహించడంతో భారతదేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత భారత ప్రభుత్వం కోబ్రాగాడెను ఐక్యరాజ్య సమితి శాశ్వత మిషన్కు పూర్తి దౌత్య పరమైన రక్షణలతో బదిలీ చేసింది. ఎట్టకేలకు గురువారం (జనవరి 9) రోజు కోబ్రాగాడెపై అమెరికా గ్రాండ్ జ్యురీ అభియోగాల నమోదు పూర్తి చేసింది.
కోబ్రాగాడెకు పూర్తి దౌత్య రక్షణ మంజూరు చేశారని, అమెరికా విడిచి వెళ్లిపోవాల్సిందిగా కోరారని న్యాయవాది తెలిపారు. ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పందిస్తూ.. ఈ మేరకు కోబ్రాగాడె భారత్కు వస్తున్నారని ట్వీట్ చేశారు.
మరో వైపు, అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో భారతదేశానికి ఉన్న శాశ్వత మిషన్లో కౌన్సెలర్ అయిన కోబ్రాగాడెకు జనవరి 8న పూర్తి స్థాయి రక్షణ కల్పించామని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఐక్యరాజ్య సమితికి, అమెరికాకు మధ్య ఉన్న హెడ్ క్వార్టర్స్ ఒప్పందంలోని సెక్షన్ 15 కింద ఇవి మంజూరయ్యాయని తెలిపింది.
అదే సమయంలో కోబ్రాగాడెకు ఉన్న దౌత్యపరమైన రక్షణను తొలగించాలని అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. అయితే అందుకు భారత ప్రభుత్వం నిరాకరించి, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు కోబ్రాగాడెను బదిలీ చేసింది. కాగా దేవయాని కోబ్రాగాడె అమెరికా విమానాశ్రయంలో మాట్లాడుతూ... కష్టకాలంలో తనకు అండగా నిలిచిన భారత ప్రభుత్వానికి, విదేశీ వ్యవహారాల మంత్రికి, భారత ప్రజలందరికీ, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.