కూతుర్ని బలి పశువును చేశారు: దేవయాని తండ్రి
న్యూఢిల్లీ: అమెరికాలో భారత దౌత్య అధికారిగా విధులు నిర్వహిస్తున్న తన కూతురు దేవయాని కోబ్రాగాడెను బలి పశువును చేశారని, వెంటనే తన కూతురును భారతదేశానికి రప్పించాలని యూపిఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీని కోబ్రాగాడె తండ్రి ఉత్తమ్ కోబ్రాగాడె కోరారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య ఏర్పడిన రాజకీయ సమస్య కారణంగా తన కూతురు బలి పశువు అయిందని అన్నారు.
ఆమెను అరెస్ట్ చేసినప్పటికీ అమెరికా అధికారులు ఆమెతో గౌరవపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కోబ్రాగాడె తండ్రి ఉత్తమ్ అన్నారు. సోనియా గాంధీ జోక్యం చేసుకుని వెంటనే తన కూతురును భారతదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన కూతురు భద్రతా, స్వేచ్ఛా విషయమై భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ను కలవనున్నట్లు తెలిపారు.
తన సహాయకురాలి విషయంలో వీసా అవకతవకల ఆరోపణలతో దేవయానిపై కేసు నమోదు చేసిన యూఎస్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆమెకు సంకెళ్లు వేయడం, విచారణ సమయంలో దుస్తులు విప్పించి తనిఖీలు చేయడం, వ్యసనపరులు, హత్యానేరాలకు పాల్పడిన వారితోపాటు ఒకే గదిలో ఉంచడం లాంటి చర్యలపై భారత ప్రభుత్వం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతేగాక భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న యూఎస్ దౌత్యవేత్తలను వారి గుర్తింపు కార్డులు తిరిగి ఇచ్చేయాల్సిందిగా ఆదేశించింది. భారత్ సందర్శనకు వచ్చిన యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధులతో భారత ప్రముఖులు సమావేశాలను కూడా తమ సమావేశాలను రద్దు చేసుకున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, హోంమంత్రి షిండే, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీ భారత పర్యటనలో ఉన్న అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులతో భేటీలను రద్దు చేసుకున్నారు.