దేవయానికి అమెరికా నో, ఎంబసీపై కేంద్రం కఠిన చర్యలు
వాషింగ్టన్/ముంబై: వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై అరెస్టయిన భారత దౌత్యాధికారిణి దేవయానిపై అభియోగాలు నమోదుకు గడువు దగ్గర పడుతుండటంతో, గడువును మరో నెలపాటు పొడిగించాలని దేవయాని కోర్టును కోరారు. అయితే ఆమె అభ్యర్థనను ప్రాసిక్యూషన్ తిరస్కరించింది.
న్యూయార్క్లోని భారత కాన్సులేట్లో డిప్యూటీ కాన్సుల్ జనరల్గా పని చేస్తున్న దేవయానిని తన పని మనిషి కోసం దాఖలు చేసుకున్న వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై గత నెల 12న అరెస్టు చేయడం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఆమెపై 30 రోజుల్లోగా అంటే ఈ నెల 13లోగా కోర్టులో అభియోగాలు నమోదు చేయాల్సి ఉంది.
అయితే గడువు దగ్గర పడుతుండటం వల్ల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇరుపక్షాల మధ్య జరుగుతున్న సంప్రదింపులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున గడువును పొడిగించాలని దేవయాని తరఫు న్యాయవాది న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ జడ్జి సారా నెట్బమ్కు సోమవారం రాత్రి దాఖలు చేసుకున్న అభ్యర్థనలో కోరారు.
గడువు పొడిగింపునకు సంబంధించి తాను ప్రాసిక్యూషన్ కార్యాలయంతో మాట్లాడానని, అయితే తాము గడువును పొడిగించాలని కోర్టును కోరబోమని ప్రాసిక్యూషన్ తెలిపిందని దేవయాని తరఫు న్యాయవాది డేనియల్ అర్షక్ ఆ అభ్యర్థనలో పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి ఇరుపక్షాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నందున అర్థవంతమైన సంప్రదింపులు జరిగేలా చూడటం కోసం గడువును పొడిగించాలని ఆయన ఆ అభ్యర్థనలో కోర్టును కోరారు.
అభ్యర్థనపై ప్రాసిక్యూషన్ అధికారి ప్రీత్ భరారా స్పందిస్తూ గడువు పొడిగింపును తమ కార్యాలయం వ్యతిరేకిస్తోందని, అంతేకాకుండా అభియోగాలు నమోదు చేరిన తర్వాత కూడా చర్చలు కొనసాగించవచ్చని పేర్కొంటూ జడ్జికి లేఖ రాశారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మేరీ హర్ఫ్ మరోసారి స్పష్టం చేసారు.
తండ్రి ఆందోళన
మరోవైపు తన కూతురు పైన కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ముంబైలోని అమెరికా ఎంబసీ ఎదుట దేవయాని తండ్రి నిరసన చేపట్టారు. దేవయాని ఎలాంటి తప్పు చేయకున్నా అరెస్టు చేయడం అమానుషమని ఆయన మండిపడ్డారు. దేవయాని పైన చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. దేవయాని అరెస్టు కిడ్నాప్తో సమానమని ఆరోపించారు. ఇది భారత్ను అవమానించడమే అన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
అమెరికా దౌత్యకార్యాలయ ప్రాంగణంలో ఈ నెల 16 నుండి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఈ నెల 16 నుండి అమెరికా దౌత్య కార్యాలయ ప్రాంగణంలో వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు కేంద్రం తెలిపింది. అమెరికా దౌత్యకారాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.