ఇండియాకి దేవయాని భర్త: జెఎన్యూలో పాఠాలు!
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికాలో భారత దౌత్యవేత్తగా పనిచేసిన దేవయాని కోబ్రాగాడె వ్యవహారంపై భారత్- అమెరికాల జరిగిన వివాదం ఇంకా ఓ కొలిక్కి రానట్లే కనిపిస్తోంది. అయితే దేవయాని కోబ్రాగాడే కుటుంబం మాత్రం భారతదేశానికి తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది.
భారత్లోని జవహర్లాల్ యూనివర్సిటీలో అధ్యాపక విభాగంలో ఏదైనా ఉద్యోగం ఉంటే చెప్పాలని అమెరికా పౌరసత్వం పొందిన కోబ్రాగాడే భర్త ఆకాశ్ సింగ్ రాథోర్ తనను అడిగినట్లు న్యూయార్క్లో విధులు నిర్వహిస్తున్న భారత అధికారి ఒకరు చెప్పారు. ఆయనతోపాటు కోబ్రాగాడే ఇద్దరు కూతుర్లు కూడా భారతదేశానికి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని తెలిపారు.
కాగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఎస్కె సపోరీ మాత్రం ఆకాశ్ సింగ్ రాథోర్కు జాబ్ ఆఫర్ గురించి తనకేలాంటి సమాచారం అందలేదని చెప్పారు. అమెరికాలోనే జన్మించిన ఆకాశ్ సింగ్ రాథోర్ న్యూయార్క్లోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వెనియాలో భోధన విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. కోబ్రాగాడె పట్ల అమెరికా అధికారులు వ్యవహరించిన తీరుపై ఆయన కొంత అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.
అదే సమయంలో దేవయాని కోబ్రాగాడె తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి ఉత్తమ్ కోబ్రాగాడె మాట్లాడుతూ.. తన అల్లుడు ఆకాశ్ సింగ్ రాథోర్ భారతదేశంలో ఉద్యోగావకాశం కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఢిల్లీ యూనివర్సిటీలో లేదా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బోధన విభాగం పని చేసేందుకు రాథోర్ ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఫిలాసఫీలో రీడర్గా ఉన్న సమయంలో రాథోర్ ఢిల్లీ యూనివర్సిటీలో టీచింగ్ చేశారని చెప్పారు. ప్రస్తుతం దేవయాని కోబ్రాగాడె ఢిల్లీలోని విదేశాంగశాఖలో డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు.