కేఫ్లో జొరబడి 18 విదేశీయులను చంపిన ఘటన నిందితుడి హతం
ఢాకా కేఫ్ పేలుళ్ల సూత్రధారిగా భావిస్తున్న నురుల్ ఇస్లాం అలియాస్ మర్జాన్ అలియాస్ షకీల్ శుక్రవారం ఉదయం హతమయ్యాడు. నాటి పేలుళ్లకు ఇతను మాస్టర్ మైండ్గా భావిస్తున్నారు.
ఢాకా: గత ఏడాది జూలై నెలలో ఢాకా కేఫ్ పేలుళ్ల సూత్రధారిగా భావిస్తున్న నురుల్ ఇస్లాం అలియాస్ మర్జాన్ అలియాస్ షకీల్ శుక్రవారం ఉదయం హతమయ్యాడు. నాటి పేలుళ్లకు ఇతను మాస్టర్ మైండ్గా భావిస్తున్నారు. ఇతని వయస్సు 22 ఏళ్లు.
ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు జరిపిన దాడుల్లో మర్జాన్, మరో అనుమానిత తీవ్రవాది హతమైనట్లు పోలీసులు చెప్పారు. తీవ్రవాదుల కదలికలపై తమకు అందిన సమాచారం మేరకు ఢాకాలోని రేయర్ బజార్ పరిసరాల్లో దాడులు జరిపారు.
అనంతరం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు. వారు కాల్పుల్లో మరణించారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అన్నది స్పష్టం చేయాల్సి ఉంది. మర్జాన్ ఢాకా దాడి కుట్రదారుల్లో ఒకడని పోలీసులు తెలిపారు.
2016 జులై 1న కొందరు ఉగ్రవాదులు ఢాకాలోని హోలీ ఆర్టిసాన్ బేకరీలో చొరబడి పద్దెనిమిది మంది విదీశీయులను బందీలుగా తీసుకుని చంపేశారు.
ఈ దాడి చేసింది తామేనని ఐసిస్ ప్రకటించింది. దాడికి సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేసింది. కానీ బంగ్లా పోలీసులు ఖండించారు. బంగ్లాదేశ్కే చెందిన జమాతె ముజాహిదీన్ (జేఎం) బంగ్లాదేశ్ అనే ఉగ్ర సంస్థ ఈ దాడి చేసిందన్నారు.