ఢాకా కిరాతకం: 20మంది గొంతుకోసి చంపేశారు, 13ని.లో ఉగ్రవాదుల అంతం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో దౌత్యవేత్తలు ఉండే ప్రాంతంలో విదేశీ అతిథులతో ప్రసిద్ధి చెందిన ఓ బేకరీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. శుక్రవారం రాత్రి హోలీ ఆర్టిసాన్ బేకరీపై దాడి చేసి, అక్కడున్న వారిని బందీలుగా పట్టుకొన్న ఉగ్రవాదులు.. తెల్లారేసరికి 20 మందిని గొంతులో తెగ్గోసి హతమార్చారు.
తమకు బందీగా చిక్కిన భారతీయ యువతి తరుషి(18)ని కూడా అత్యంత కిరాతకంగా చంపివేశారు. శనివారం ఉదయం కమాండోలు తుది దాడికి దిగడంతో.. 7.40 గంటలకు (స్థానిక సమయం) తుపాకీ కాల్పులు, పేలుడు శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కమాండోలు ఆరుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. ఒకరిని సజీవంగా పట్టుకున్నారు.
ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురైన విదేశీయుల్లో 9 మంది ఇటలీ దేశస్థులు, 7గురు జపాన్వాసులు, ఒకరు అమెరికన్ ఉన్నారు. తమదేశానికి చెందిన ఒకరి ఆచూకీ తెలియడం లేదనీ ఇటలీ విదేశాంగ మంత్రి పావోలో పేర్కొన్నారు. దాడిలో మరణించిన ఇద్దరి వివరాలపై అస్పష్టత నెలకొంది. మృతుల్లో ముగ్గురు బంగ్లా దేశీయులూ ఉన్నట్లు సమాచారం. కమాండోలు 13 మంది బందీల్ని విడిపించారు. దాడుల్లో సుమారు 30 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ థండర్బోల్ట్.. 13 నిమిషాల్లో ముగించాం
దాదాపు 11గంటలపాటు సాగిన సైనిక ఆపరేషన్ శనివారం ఉదయం ముగిసినట్లు బంగ్లాదేశ్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ నరుూమ్ అష్ఫక్ చౌదరి తెలియజేశారు. భద్రతా దళాల జాయింట్ ఆపరేషన్ ప్రారంభం కావడానికి ముందే ఉగ్రవాదులు 20మంది బందీలను నరికి చంపేశారని చెప్పారు.
చనిపోయిన వారిలో చాలామంది గొంతులు కోసి ఉండటం కనిపించిందని కూడా చెప్పారు. ఆర్మీ పారా కమాండోస్ యూనిట్-1 ఈ ఆపరేషన్కు నాయకత్వం వహించిందని, 13 నిమిషాలలోపే ఆరుగురు టెర్రరిస్టులను హతమార్చిందని చౌదరి మీడియాకు చెప్పారు. బందీల సంక్షోభానికి ముగింపు పలకాలని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సైన్యాన్ని ఆదేశించిన తర్వాత శనివారం తెల్లవారుజామున 'ఆపరేషన్ థండర్ బోల్ట్' ప్రారంభమైంది.
ప్రధానమంత్రి షేక్హసీనా మాట్లాడుతూ..'ఘటనాస్థలం నుంచి ఒక్క ఉగ్రవాదినీ పారిపోనివ్వలేదు, ఆరుగుర్ని మట్టుబెట్టి, ఒకరిని సజీవంగా పట్టుకొన్నామన్నారు. రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. పరిస్థితుల మేరకు రాత్రికిరాత్రే సైనిక కమాండోల్ని తరలించామనీ, తెల్లవారుజామున 4 గంటలకు ఆపరేషన్ ప్రణాళిక రూపొందించి, దాడిని మొదలుపెట్టినట్లు వివరించారు.'ఇది అత్యంత క్రూర చర్య, వారికెలాంటి మతమూ లేదు. ఉగ్రవాదమే వారి మతం. మతం పేరిట చంపడాన్ని చాలించండి'అని అన్నారు.
దాడి చేసింది మేమే: ఐసిస్
కాగా, దాడికి తామే బాధ్యులమని ఆపరేషన్ ముగిసిన దాదాపు 4 గంటల తర్వాత ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపుతన అమక్ వార్తాసంస్థ ద్వారా ప్రకటించుకుందని అమెరికాకు చెందిన 'సైట్' ఇంటెలిజన్స్ గ్రూపు తెలియజేసింది, ఆ తర్వాత కొంత సేపటికి ఆ సంస్థ రెస్టారెంట్ లోపల దృశ్యాల ఫోటోలను కూడా విడుదల చేసింది. చాలా మృత దేహాలు రక్తపు మడుగులో పడి ఉన్న దృశ్యాలు వాటిలో ఉన్నాయి.
కోల్కతాలో హైఅలర్ట్
బంగ్లాదేశ్లో ఉగ్రదాడి నేపథ్యంలో పొరుగునే ఉన్న పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో హై అలర్ట్ ప్రకటించారు. సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. బస్ స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు ఢాకాలో ఉగ్రవాదుల దాడిని ప్రఖ్యాత అజ్మీర్ దర్గా చీఫ్ జైనుల్ అబెదిన్ అలీఖాన్ ఖండించారు.
ఇది మాటలకందని వ్యథ: మోడీ
ఢాకాలో ఉగ్రవాదులు జరిపిన దాడులు మాటలకందని వ్యధను కలిగించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. విషాదకరమైన ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్కు భారత్ వెన్నంటి నిలిస్తుందని భరోసా ఇచ్చారు. ఉగ్రదాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం ఫోన్లో సంభాషించారు. హేయమైన ఈ దాడులను తీవ్రంగా ఖండించారు.
గట్టిగానే బదులిస్తాం: ఇటలీ ప్రధాని
ఢాకాలో పలువురు ఇటలీవాసులను హతమార్చడంపై ఉగ్రవాదులకు ఇటలీ ప్రధాని హెచ్చరికలు జారీచేశారు. ఈ నరమేథానికి గట్టిగానే బదులిస్తామని శనివారం ఆయన వ్యాఖ్యానించారు. దాడిలో ఎంత మంది ఇటలీ ప్రజలు మృతి చెందారో ఆయన చెప్పలేదు. 'మా దేశం ఓ కుటుంబం లాంటిది. దాడుల్లో పలువురు మా కుటుంబ సభ్యులు చనిపోవడం మాకు తీరనిలోటు. దీనికి గట్టిగానే ప్రత్యుత్తరమిస్తాం'అని ఆయన వ్యాఖ్యానించారు.