లోకసభ ఎన్నికల తర్వాతే, చర్చలకు మోడీ-రాహుల్లలో ఎవరు కావాలంటే... పాక్ మంత్రి మాట ఇదీ!
దుబాయ్: భారతదేశంలో వచ్చే లోకసభ ఎన్నికల తర్వాతే తమ దేశం ఇండియన్ గవర్నమెంట్తో శాంతి ఒప్పందాలు జరిపే ప్రయత్నాలు చేస్తుందని పాకిస్తాన్కు చెందిన ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం (మోడీ ప్రభుత్వం) నుంచి పెద్ద నిర్ణయాలు ఆశించే పరిస్థితి లేదని చెప్పారు.
పాకిస్తాన్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫవాద్ చౌదరి గల్ఫ్ న్యూస్తో మాట్లాడారు. ప్రస్తుత భారతదేశంలో నాయకులు అందరు కూడా లోకసభ ఎన్నికల కోసం సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శాంతి ఒప్పంద చర్చలు ఈ సమయంలో సరికాదని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం అక్కడ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని, కాబట్టి ఇప్పుడు భారత్తో చర్చలు జరిపి ప్రయోజనం ఉండదని, లోకసభ ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తమ ప్రయత్నాలు ప్రారంభిస్తామని చెప్పారు.
అందుకే చర్చల ప్రక్రియ ముందుకు తీసుకెళ్లలేదు
అదే సమయంలో మోడీ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న భారత నాయకత్వం (మోడీ ప్రభుత్వం) నుంచి ఎలాంటి పెద్ద నిర్ణయాలు ఉండవని, అందుకే భారత్తో తమ చర్చల ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లలేదని అభిప్రాయపడ్డారు. మోడీ ప్రభుత్వం పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్లకు కొరకురాని కొయ్యగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వస్తుందని ఆశిస్తున్నారు. ఆ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని అభిప్రాయపడుతున్నారు.
మోడీ-రాహుల్ గాంధీలలో చర్చలకు ఎవరు బెట్టర్ అంటే
సదరు పాకిస్తాన్ మంత్రి ఇంకా మాట్లాడుతూ... పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశ ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతి భారతీయ నేతను గౌరవిస్తుందని చెప్పారు. మీతో (పాకిస్తాన్) చర్చలకు భారతదేశంలోని ఏ నేత అయితే బాగుంటుందని భావిస్తున్నారని, నరేంద్ర మోడీ అయితే బాగుంటుందా, రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా అని ప్రశ్నించగా.. సదరు మంత్రి స్పందిస్తూ.. నాయకుడు ఎవరు అనేది తమకు సంబంధం లేని విషయమని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా తాము శాంతి చర్చలను ప్రారంభిస్తామని తెలిపారు.
శాంతి చర్చలపై స్పష్టమైన విధానంతో మోడీ ప్రభుత్వం
2016లో పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు దాడి చేయడం, ఆ తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో భారత్-పాక్ చర్చల పైన ప్రభావం పడింది. పాకిస్తాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, పాక్ నుంచి వచ్చిన వారు తీవ్రవాద దాడులు చేస్తున్న నేపథ్యంలో చర్చల విషయంలో మోడీ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉంది. తీవ్రవాద దాడులు, శాంతి చర్చలు ఒకేచోట ఉండవని, తీవ్రవాద దాడులు ఆపితేనే శాంతి చర్చలు అని చెబుతున్నారు.
భారత్-పాక్ మధ్య అది గొప్ప ముందడుగు
సదరు పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి ఇంకా మాట్లాడుతూ... గత ఏడాది నవంబర్ నెలలో పాకిస్తాన్ - భారత్ మధ్య కర్తార్పూర్ కారిడార్ నిర్మాణం రెండు దేశాల మధ్య గొప్ప ముందడుగు అని చెప్పారు. ఈ కర్తార్పూర్ కారిడార్ కేవలం సిక్కులకు మాత్రమే ఉపయోగకరం కాదని, భారత్ - పాకిస్తాన్ మధ్య సంబంధాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్లో ప్రభుత్వం, ఆర్మీ మధ్య విభేదాల గురించి మాట్లాడుతూ... గత పాకిస్తాన్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య విభేదాలు ఉండేవని చెప్పారు. ఇరు వర్గాలు నేరుగా మాట్లాడుకోలేకపోయాయని చెప్పారు. కానీ ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చాక మారిందని చెప్పారు.