టెహ్రాన్లో ఉక్రెయిన్ విమాన ప్రమాదం: ఇరాన్ క్షిపణే కూల్చిందా..తెరపైకి ఎన్నో అనుమానాలు
ఉక్రెయిన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్కు సమీపంలో ఉక్రెయిన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ విమానం సాంకేతికలోపం వల్లే కూలిందా..? లేక ఇరాన్ అమెరికా దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఆ విమానంను కూల్చేశారా..? మొత్తం 176 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ప్రమాదం వెనక ఏదైనా నిజం దాగి ఉందా..? ఇవే అనుమానాలను ఉక్రెయిన్ వ్యక్తం చేస్తోంది.
టార్గెట్ అమెరికా: ఇరాన్ క్షిపణి దాడుల్లో 80 మంది మృతి.. యుద్ధం ప్రారంభమైందా..?
తెరపైకి ఎన్నో అనుమానాలు
ఇరాన్లో బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో 176 మంది ప్రయాణికులు మృతి చెందారు. అయితే ముందుగా ఇది ప్రమాదమే అని చెప్పినప్పటికీ ఆ తర్వాత పరిణామాలతో ఉక్రెయిన్ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇరాన్ అమెరికా దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ విమానం కూల్చడం జరిగిందా అనే అనుమానాలను ఉక్రెయిన్ వ్యక్తం చేస్తోంది. ఇరాన్ అమెరికా సైన్యంపైకి ప్రయోగించిన క్షిపణి ఈ విమానంను ఢీకొట్టిందా అనే అనుమానాలను కూడా ఉక్రెయిన్ వ్యక్తం చేస్తోంది. టెహ్రాన్లోని ఇమామ్ ఖొమేని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే విమానం కూలింది.
అన్ని కోణాల్లో దర్యాపు చేయండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు
ఫ్లయిట్ రేడార్పై చివరిసారిగా ప్రమాదానికి గురైన బోయింగ్ 737-800 విమానం 2400 మీటర్ల ఎత్తులో కనిపించింది. అంతకుముందు ఇరాన్ డజనుకుపైగా క్షిపణులను అమెరికా తిష్టవేసి ఉన్న ఇరాక్ బేస్లపైకి ప్రయోగించింది. విమాన ప్రమాదం సాంకేతిక కారణాలతోనే క్రాష్ అయ్యిందని నివేదిక ఇచ్చిన తర్వాత అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆదేశించారు. వెంటనే విచారణ చేపట్టాలని ఉక్రెయిన్ అధికారులను అధ్యక్షుడు ఆదేశించారు. ఇక అప్పటి వరకు సాంకేతికలోపంతోనే ప్రమాదం జరిగిందని ఉక్రెయిన్ ఎంబసీ తన వెబ్సైట్లో పెట్టగా అధ్యక్షుడి ప్రకటనకు కొన్ని నిమిషాల ముందు సాంకేతిక కారణం అనే ప్రకటనను వెబ్సైట్ నుంచి తొలగించింది.
క్షిపణి ఢీకొందంటూ ఇరాన్ మీడియా వార్తలు
ఇదిలా ఉంటే పొరపాటున ఇరాన్ క్షిపణి విమానంను ఢీకొట్టిందని ఇరాన్లోని జోర్దానియన్ అల్ హదత్ వార్తా పత్రిక కథనం ప్రసారం చేసిన విషయాన్ని ఉక్రెయిన్కు చెందిన న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అధికారికంగా జరిగే విచారణ పూర్తయ్యే వరకు ఘటనపై ఎలాంటి వెర్షన్లు వినిపించినా నమ్మడానికి వీల్లేదంటూ ఉక్రెయిన్ ప్రధాని ఓలెక్సీ హంచారుక్ చెప్పారు. విమాన ప్రమాదంను విచారణ చేసేందుకు ఉక్రెయిన్ నుంచి నిపుణుల బృందం ఇరాన్కు బయలుదేరిందని వెల్లడించారు. ఇక విమానంలో ప్రయాణించిన ప్రయాణికుల్లో ఎక్కువగా ఇరాన్ దేశస్తులు ఉండగా 63 మంది కెనడా దేశస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇరాన్ సంతతికి చెందిన కెనడా వాసులు ఎక్కువగా టెహ్రాన్-టొరొంటో రూట్లో ప్రయాణిస్తారని అధికారులు తెలిపారు.
మేము విచారణకు పూర్తిగా సహకరిస్తాం: జస్టిస్ ట్రూడో
ఇదిలా ఉంటే 2012లో ఇరాన్తో సత్సంబంధాలను తెంచుకుంది కెనడా. అయితే ఈ ప్రమాదంలో కెనడా వాసులు మృతి చెందడంతో విచారణకు కెనడా కూడా సహకరిస్తుందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో హామీ ఇచ్చారు. ఇరాన్ విదేశాంగ మంత్రితో కెనడా విదేశాంగ మంత్రి మాట్లాడి పూర్తిస్థాయి విచారణకు సహకరించాలని కోరుతారని ట్రూడో చెప్పారు.అయితే విచారణ పూర్తి కాకుండానే ప్రమాదంపై ఒక అంచనాకు రాకూడదని చెప్పారు. ఇదిలా ఉంటే విమాన ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కీలకంగా ఉండే బ్లాక్ బాక్స్లను స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ అధికారులు తెలిపారు.
క్షిపణి దాడి వల్లే అనేది పుకార్లు: ఇరాన్
ఇదిలా ఉంటే ఇరాన్ క్షిపణి దాడుల్లోనే విమానం కూలిందని చెప్పడం సరికాదని అవన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు ఇరాన్ సైన్యం తరపున ప్రతినిధి జనరల్ అబుల్ఫజల్ షేకర్కీ. యుద్ధ వాతావరణం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది తప్ప ఇందులో నిజం లేదని అన్నారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం విమానం ఇరాన్లో కూలింది కాబట్టి విచారణ చేసే అధికారం ఇరాన్కే ఉంటుందని గుర్తుచేశారు ఇరాన్ సివిల్ ఏవియేషన్ హెడ్ అబెద్జాదే. స్వాధీనం చేసుకున్న బ్లాక్ బాక్సులను అమెరికాకు గానీ బోయింగ్ సంస్థకు గానీ ఇవ్వమని తేల్చి చెప్పారు.
మూడురోజుల క్రితమే మెయిన్టెనెన్స్ చెక్ చేశాం
మరోవైపు మూడురోజుల క్రితమే కూలిన విమానంకు సంబంధించి మెయిన్టెనెన్స్ చెక్ చేయడం జరిగిందని ఆ సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తలేదని ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ చెబుతోంది. అంతేకాదు ఈ విమానంలో ఉన్న సిబ్బంది కూడా అత్యంత చాకచక్యం నైపుణ్యం ఉన్న సిబ్బందని ... ఈ విమానం బెస్ట్ విమానంగా అభివర్ణించారు ఎయిర్లైన్స్ సీఈఓ యెవ్హెన్ డైఖ్నీ. అయితే దీన్ని క్షిపణి కూల్చివేసిం ఉంటుందా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు.