ఎంహెచ్ 370, 17 ఎఫెక్ట్: ఎయిర్ లైన్స్ పేరు మార్పు!
కౌలాలంపూర్: ఎంహెచ్ 370, ఎంహెచ్ 17 ప్రమాదాల నేపథ్యంలో మలేషియా ఎయిర్ లైన్స్ విమానం పేరును మార్చుకోనుందని వార్తలు వెలువడుతున్నాయి. ఆరు నెలల వ్యవధిలోనే మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానాలు రెండు కూలిపోయాయి. ఈ నేపథ్యంలో... సంస్థ కోల్పోయిన ప్రతిష్టను తిరిగి నిర్మించే పనిలో పడింది.
ఇందులో భాగంగా మలేషియా ఎయిర్ లైన్స్ పేరును మార్చనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జరిగిన నష్టాన్ని పూడ్చుకుని పునర్నిర్మించుకోవాలని చూస్తున్నట్లు యూకె టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది.
ఎయిర్ లైన్స్లో మెజారిటీ శాతం ప్రభుత్వానిదే. అయితే, సంస్థలో కొత్త పెట్టుడిదారులను ఎదురుచూస్తోంది. అంతేకాక సంస్థ లాభదాయకతకోసం అవుట్ సోర్సింగ్ను విస్తరించాలనుకుంటోంది. ఆరు నెలల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో 537 మంది మరణించారని పత్రిక వివరించింది.
ఈ ఏడాది మార్చిలో ఎంహెచ్ 370 విమానం గల్లంతయింది. కౌలాలంపూర్ నుండి బీజింగ్కు వెళ్తున్న ఈ విమానంలో 239 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఇందులో ఐదుగురు బారతీయులు ఉన్నారు. క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆ తరవాత ఎంహెచ్ 17 ప్రమాదంలో 298 మంది చనిపోయారు.