coronavirus: ఫిలిప్పీన్స్ ఎయిర్పోర్టులో చిక్కుకొన్న భారతీయ విద్యార్థులు, ట్రావెల్ బ్యాన్తో ఆందోళన.
కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోన్న కొద్దీ ఆందోళన నెలకొంది. విదేశీయుల నుంచి వైరస్ ప్రబలుతుండటంతో కొన్ని దేశాలపై ఆంక్షలు విధించారు. చైనా, ఇటలీ తర్వాత ఫిలిప్పీన్స్లో కూడా వైరస్ ప్రభావం ఎక్కువే. అయితే అక్కడ వందలాది మంది భారతీయులు చిక్కుకొన్నారు. స్వదేశం రప్పించే ఏర్పాట్లు చేయాలని వారు వీడియో ద్వారా కోరుతున్నారు. ఇక్కడినుంచి భారత్ వెళ్లేందుకు అనుమతించకపోవడంతో తాము ఇక్కడే ఉన్నామని వారు వాపోతున్నారు.
ఫిలిప్పీన్స్లో చిక్కుకొన్న భారతీయ విద్యార్థుల.. స్నేహితులు, బంధువులు కొందరు అమెరికాలో కూడా ఉన్నారు. అయితే అమెరికా కూడా ఆంక్షలు విధించడంతో వారు ఇండియా రాలేక, అమెరికా పోలేక ఫిలిప్పీన్స్లోనే చిక్కుకొన్నారు. ఫిలిప్పీన్స్ సహా ఆఫ్ఘనిస్థాన్, మలేషియా నుంచి ప్రయాణికులపై భారతదేశం మంగళవారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.
Recommended Video
మరికొద్ది రోజుల్లో తాము భారత్ వచ్చేందుకు విమాన టికెట్ బుక్ చేసుకున్నామని అఖిల్ బాల నాయర్ అనే విద్యార్థిని వీడియోలో పేర్కొన్నారు. దాదాపు 200 మంది టికెట్ బుక్ చేసుకున్నామని.. కానీ మంగళవారం భారత ప్రభుత్వం ఫిలిప్పీన్స్ నుంచి వచ్చేవారిపై కూడా నిషేధం విధించడంతో తాము ఇక్కడే ఉండాల్సి వచ్చిందని వాపోయారు. చాలా మంది విద్యార్థులు ఈ నెల 17వ తేదీన టికెట్ బుక్ చేశామని.. మిగతావారు 19, 20వ తేదీల్లో బుక్ చేసుకున్నారని పేర్కొన్నారు. విమాన సర్వీసులు రద్దు చేయడంతో మనీలాలో ఉండిపోయామని పేర్కొన్నారు. వీరిలో చాలామంది మంగళవారం నుంచి ఎయిర్పోర్టులోనే ఉంటున్నారు. ఫిలిప్పీన్స్లో ఉన్న భారతీయ విద్యార్థులను ప్రత్యేక విమానంలో ఇండియా తీసుకురావాలనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.