ఐసిస్ ఆడియో టేప్..సంచలన విషయాలు: బాగ్దాది ఒక్కడే కాదు: అమెరికా గుమ్మంలో నిల్చున్నాం..!
బీరుట్: వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ముద్ర ఉన్న అబు బాకర్ అల్ బాగ్దాదీ మరణించిన విషయాన్ని ఐసిస్ ధృవీకరించింది. అబు బాకర్ ఒక్కడే కాకుండా కొందరు టాప్ మోస్ట్ ఉగ్రవాదులు కూడా అమెరికా సైనిక బలగాలు నిర్వహించిన ఆపరేషన్ లో హతమైనట్లు వెల్లడించింది. అమెరికా తాజాగా చేపట్టిన ఈ దాడుల వల్ల తాము భారీగా నష్టపోయినట్లు పేర్కొంది. అయినప్పటికీ.. త్వరలోనే పుంజుకుంటామని స్పష్టం చేసింది. ఇస్లామిక్ స్టేట్స్ అధికార ప్రతినిధి అబు హమ్జా అల్ ఖుర్యాషీ పేరుతో ఓ ఆడియో టేపు విడుదలైంది. ఐసిస్ మీడియా విభాగం అల్-ఫుర్కాన్ ఫౌండేషన్ దీన్ని విడుదల చేసింది.
అయిదురోజుల తరువాత తొలిసారిగా..
ప్రపంచాన్ని వణికించిన భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బాకర్ అల్ బాగ్దాది కిందటి నెల 27వ తేదీన అమెరికా సైనిక బలగాలు నిర్వహించిన దాడుల సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సిరియా ఇడ్లిబ్ ప్రావిన్స్ లోని బార్షియాలో అల్ బాగ్దాది స్థావరాన్ని చుట్టు ముట్టిన తరువాత.. తప్పించుకునే మార్గం కనిపించకపోవడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తనను తాను పేల్చేసుకున్నాడు. అతని మరణాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించాడు. అనంతరం బాగ్దాది మృతదేహాన్ని అమెరికా సైనిక బలగాలు సముద్ర గర్భంలో గుర్తు తెలియని చోట పాతి పెట్టేశాయి.
నూతన నాయకత్వం..మీడియా విభాగం కూడా..
ఈ పరిణామం చోటు చేసుకున్న అయిదు రోజుల తరువాత.. ఐసిస్ తొలిసారిగా స్పందించింది. ఆడియో టేపును విడుదల చేసింది. అల్ బాగ్దాది ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ధృవీకరించింది. ఈ మేరకు ఓ ఆడియో టేపును విడుదల చేసింది. ఐసిస్ నూతన అధికార ప్రతినిధి అబు హమ్జా అల్ ఖుర్యాషీ పేరు మీద ఈ ఆడియోను విడుదల చేసింది ఐసిస్ మీడియా విభాగం. అమెరికా సైనిక దాడల్లో బాగ్దాది ఒక్కడే కాకుండా.. కొందరు కీలక నాయకులు మరణించినట్లు అబు హమ్జా వెల్లడించారు. అబు హసన్ అల్ ముహాజిర్ సైతం మరణించినట్లు ప్రకటించారు.
కొత్త నాయకుడిగా అబు ఇబ్రహీం అల్ ఖురేషీ..
బాగ్దాది లేని లోటును భర్తీ చేసుకోవడానికి తాము యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని, కొత్త నాయకుడిగా అబు ఇబ్రహీం అల్ ఖురేషీని నియమించినట్లు హమ్జా తెలిపారు. త్వరలోనే తాము పుంజుకొంటామని, మరింత విజృంభిస్తామని చెప్పారు. తూర్పు నుంచి పశ్చిమం వరకూ తాము విస్తరిస్తామని, అమెరికా అంతు చూస్తామని హెచ్చరించారు. తాము ఇప్పటికే అమెరికా, సెంట్రల్ ఆఫ్రికా దేశాల ముంగిట్లోకి వచ్చామని, మిగిలిన ప్రపంచ దేశాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే తమ నెట్ వర్క్ చాలా దేశాల్లో విస్తరించి ఉందని, ప్రస్తుతం నిద్రాణ వ్యవస్థలో ఉన్న ఆ నెట్ వర్క్ మరింత పటిష్టం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.