ఆహార పదార్థాల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుందా?: తేల్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
జెనీవా: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ప్రజలందరూ భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెబుతున్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం ఆందోళనలు పోవడం లేదు. మనదేశంలో లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో జన సంచారం ఎక్కువై కరోనా కేసులు కూడా పెరుగుతున్న విషయం తెలిసిందే.
Recommended Video
కరోనా వ్యాపించే అవకాశం లేదు..
ఈ క్రమంలో ప్రజల్లో కరోనా పట్ల అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బయటి ఆహార పదార్థాలను తీసుకోవాలా? వద్దా? అనే సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) దీనిపై స్పష్టం ఇచ్చింది. ఆహార ఉత్పత్తులు, వాటి ప్యాకేజింగ్ నుంచి కరోనా వ్యాపించే అవకాశం లేదని తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఆహార పదార్థాలపై ఆందోళన అవసరం లేదు..
ప్రజలు ఆహార సరఫరాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. రెండ్రోజుల క్రితం చైనాలోని జియాన్, షెన్జెన్ నగరాలకు బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న చికెన్ వింగ్స్, ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యల ఉత్పత్తుల్లో కరోనావైరస్ను గుర్తించినట్లు చైనా అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
భయపడాల్సిన అవసరం లేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
ప్రజలు ఆహార పదార్థాలు, వాటి ప్యాకేజింగ్, ప్రాసెసింగ్, ఫుడ్ డెలివరీ గురించి భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమ్మెర్జెన్సీ ప్రోగ్రామ్ హెడ్ మైక్ ర్యాన్ తెలిపారు. ఆహార్థాలు, ఫుడ్ చైన్ ద్వారా కరోనావైరస్ వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవన్నారు. వినియోగదారులు వాటిని ఎలాంటి ఆందోళన లేకుండా సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేశారు.
చైనా ఆరోపణల నేపథ్యంలో..
కాగా, చైనా ఆరోపణలపై బ్రెజిల్, ఈక్వెడార్ దేశాలు స్పందించాయి. తమ దేశం కరోనా నిబంధనలను కఠినంగా పాటిస్తోందని, ప్యాకేజీలు ఒకసారి దేశం దాటాక వాటితో తమకు సంబంధం లేదని ఈక్వెడార్ ప్రకటించింది. చైనా మినహా ఇతర దేశాల నుంచి ఇలాంటి ఫిర్యాదులు రాలేదని వ్యాఖ్యానించింది. ఇక చైనా కనుగొన్న దానిపై పూర్తి సమాచారం కోసం వేచిచూస్తున్నామని, ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని బ్రెజిల్ వెల్లడించింది.