అప్పట్లో నెహ్రూ.. ఇప్పుడు మోడీ, భారత్ లో మార్పు రాదా? మళ్లీ రెచ్చిపోయిన చైనా ‘గ్లోబల్ టైమ్స్’
డోక్లాం సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా అధికారిక మీడియా భారత ప్రభుత్వానికి రోజుకో రకంగా హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈసారి నేరుగా ప్రధాని మోడీకే హెచ్చరిక చేసింది.
బీజింగ్: డోక్లాం సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా అధికారిక మీడియా భారత ప్రభుత్వానికి రోజుకో రకంగా హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈసారి నేరుగా ప్రధాని మోడీకే హెచ్చరిక చేసింది.
1962లో కూడా చైనా చేసిన హెచ్చరికలను నెహ్రూ పట్టించుకోలేదని, అదే పని ఇప్పుడు మోడీ కూడా చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చైనాకు చెందిన 'గ్లోబల్ టైమ్స్' పత్రిక తాజాగా ప్రచురించిన సంపాదకీయంలో పేర్కొంది.
అప్పట్లో ప్రధాని నెహ్రూ కూడా చైనా రాజకీయ పరిస్థితులు సరిగా లేవని, దౌత్యవిధానాలు కూడా అంతంత మాత్రమే అని భావించి.. అది యుద్ధానికి దిగదులే అని చైనాను తక్కువ అంచనా వేశారని, కానీ ఎన్ని క్లిష్టపరిస్థితులున్నా చైనా తమ భౌగోళిక పరిధి విషయంలో ఇతర దేశాల ప్రమేయాన్ని సహించలేదని ఆయన ఊహించలేకపోయారని ఆ కథనంలో పేర్కొంది.
ఆ తర్వాత జరిగిన యుద్ధ పరిణామాలను చవి చూసి కూడా భారత్ ఇంకా అదే రాజకీయ నీతిని, అప్పటి రాజకీయ కుయుక్తులనే ఉపయోగిస్తోందని, భారత్ లో ఏమాత్రం మార్పు రాలేదని 'గ్లోబల్ టైమ్స్' ఆరోపించింది. సిక్కిం ప్రాంతంలోని డోక్లాం సరిహద్దులో భారత్ - చైనా సైన్యాల మధ్య రోజురోజుకి ఉద్రిక్తత పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.