తీవ్ర ఇబ్బందిలేదు, ఐనా మన సైన్యం రెడీ: చైనాపై ఆర్మీ చీఫ్ రావత్
న్యూఢిల్లీ: డొక్లామ్ తర్వాత సరిహద్దుల్లో ఎలాంటి సీరియస్ ట్రబుల్ కనిపించలేదని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. భారత్ - చైనా దేశాల మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడ్డాయని చెప్పారు. డొక్లాం ప్రతిష్టంభనకు ముందు ఉన్నటువంటి సుహృద్భావ వాతావరణం ఇరు దేశాల మధ్య తిరిగి ఏర్పడిందన్నారు.
అందువల్ల తీవ్రమైన ఇబ్బందికర పరిణామాలను ఊహించుకోవడం లేదని ఆయన చెప్పారు. అయితే ఎవరైనా సరే అటువంటి పరిస్థితి పట్ల ఎల్లప్పుడూ సర్వసన్నద్ధంగా ఉండాలని అన్నారు. డొక్లాం గురించి చూసినట్లయితే, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు ఆ ప్రాంతంలో ఓ చోట ఉన్నారని చెప్పారు. మొదట్లో కనిపించినంత మంది లేరన్నారు.
అక్కడ మౌలిక సదుపాయాలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించారని, అవి తాత్కాలిక స్వభావంగలవని రావత్ వివరించారు. చైనా సైన్యం మళ్ళీ రావచ్చునని కొందరు ఊహించవచ్చునని, చలికాలం అయినందువల్ల వాళ్ళు తమ సామగ్రిని తీసుకెళ్ళలేకపోయి ఉండవచ్చునని, ఏది ఏమైనప్పటికీ, భారత సైన్యం అక్కడ ఉందన్నారు.
ఒకవేళ వాళ్ళు వస్తే ఎదుర్కొంటామని రావత్ చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తొలగించడంలో యంత్రాంగం చక్కని కృషి చేస్తోందని చెప్పారు. డొక్లాం ప్రతిష్టంభన తర్వాత క్షేత్ర స్థాయిలో ఇరు దేశాల సైనిక దళాల మధ్య నిత్యం సమాచార మార్పిడి జరుగుతోందన్నారు.
డొక్లాంలో ఉత్తర దిశగా చైనా నియంత్రణ పెరుగుతోందని ఇటీవల మీడియా కథనాలు వచ్చిన నేపథ్యంలో జనరల్ రావత్ తెలిపిన వివరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వివాద స్థలంలో చైనా రోడ్లు తదితర మౌలిక సదుపాయాలను విస్తరించిందని మీడియా పేర్కొన్న విషయం తెలిసిందే.